మంత్రి సభలో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి.. 15 మందిని అరెస్టు చేసిన పోలీసులు

మంత్రి సభలో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి.. 15 మందిని అరెస్టు చేసిన పోలీసులు

చెన్నూర్, వెలుగు: చెన్నూరులో మంత్రి హరీశ్ రావు సభలో ప్లకార్డులతో నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారు. చెన్నూరులో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు హరీశ్ వచ్చిన సందర్భంగా అంబేద్కర్ చౌక్​లో మీటింగ్ ఏర్పాటు చేశారు. స్టేజ్​పై మంత్రి మాట్లాడుతుండగా ఎదురుగా కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్తలు లేచి ప్లకార్డులు ప్రదర్శించారు. ‘కౌలు రైతులకు బీమా ఇవ్వాలి, నిరుద్యోగ భృతి చెల్లించాలి, కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి అని ప్లకార్డులు ప్రదర్శించారు. 

‘బాల్క సుమన్ డౌన్ డౌన్.. హరీశ్ రావు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్టేజ్ పై ఉన్న పలువురు బీఆర్ఎస్ లీడర్లు, కౌన్సిలర్లు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు మొత్తం 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు.