హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా గోపాలపూర్ లో డబ్బుల విషయంలో గొడవ పడి ఓ యువకుడు తన స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. కాకతీయ యూనివర్సిటీ సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివకాలనీకి చెందిన రాంచరణ్, ఓంసాయి కాలనీకి చెందిన కార్తీక్, మహర్షి స్నేహితులు. ఆదివారం రాంచరణ్, కార్తీక్ కలిసి గోపాల్పూర్ చెరువు సమీపంలో మద్యం తాగారు.
మద్యం మత్తులో వీరిద్దరి మధ్య గతంలో లూప్ లింక్ యాప్ లో రూ.3లక్షల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన కార్తీక్ తన వద్ద ఉన్న కత్తితో రాంచరణ్పై దాడి చేశాడు.
తీవ్రగాయాలతో రాంచరణ్ కేకలు వేయగా, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు కార్తీక్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేయూ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
