
- ఢిల్లీలో ఘటన.. నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ: బహిరంగ స్థలంలో మూత్రం పోయవద్దని చెప్పిన వ్యక్తిపై కర్రతో విచక్షణారహితంగా దాడిచేశాడు ఓ పోకిరి. ఉత్తర ఢిల్లీలోని మోడల్ టౌన్ లో ఈనెల 4 న ఈ ఘటన జరిగింది. బాధితుడిపై పోకిరి దాడి చేస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
నిందితుడు ఆర్యన్.. మోడల్ టౌన్ లోని ఓ ఇంట్లో నౌకరుగా పనిచేస్తున్నాడు. బాధితుడు రామ్ ఫాల్ కూడా అదే ఏరియాలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ నెల 3న రామ్ ఫాల్ ఓ పార్కు వద్ద నిద్రపోతున్నాడు.
ఆర్యన్ అక్కడికెళ్లి రామ్ ఫాల్ కు సమీపంలో మూత్రం పోయడం ప్రారంభించాడు. ఇక్కడ మూత్రం పోయవద్దని రామ్ ఫాల్ చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. మరుసటి రోజు కూడా రామ్ ఫాల్ అదే ఏరియాలో నిద్రపోతున్నాడు.
ఆరోజు ఆర్యన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్ పై వచ్చి రామ్ ఫాల్ వద్దకు వెళ్లాడు. ఆర్యన్ అతనిని లేపి 20 సెకన్ల పాటు కర్రతో తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడు. మళ్లీ వచ్చి రామ్ ఫాల్ పై దాడిచేసి బైక్ పై పారిపోయాడు.
రామ్ ఫాల్ ను అతను కొడుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఆర్యన్ను అరెస్టు చేశారు. అయితే, బెయిల్ పై అతడిని విడుదల చేశారు.