- నల్గొండలో సీసీఎస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల కోసం 3 ఎకరాలు కేటాయింపు
- కోర్టు వివాదంలో ల్యాండ్.. ఆగిన పనులు
- ఇదే అదనుగా ఆక్రమణకు రూలింగ్ పార్టీ నేతల యత్నం
నల్గొండ, వెలుగు : నల్గొండ పట్టణంలో పోలీసుల భూమినీ ఆక్రమించడానికి కబ్జాదారులు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆక్రమణను అడ్డుకోగలిగారు. నల్గొండ పట్టణంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్), ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు పక్కా భవనాలు నిర్మించేందుకు 2012లో ఎస్ఎల్బీసీ వద్ద 3 ఎకరాల ల్యాండ్ ప్రభుత్వం కేటాయించింది. నల్గొండ పరిధిలోని కతాల్గూడెం, మామిళ్లగూడెం, గంధవారిగూడెం మధ్య కొంత గ్యాప్ ఏరియా ఉంది. దీన్ని మాతృక ల్యాండ్ అని పిలుస్తారు. ఇలాంటి భూములకు ప్రత్యేకంగా సర్వే నంబర్లు ఉండవు. ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తారు. సుమారు 4.3 ఎకరాలున్న ఈ ల్యాండ్లో రోడ్డు భాగం మినహా మిగిలిన మూడెకరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్తో సర్వే చేయించి పోలీస్ డిపార్ట్మెంట్కు కేటాయించారు. దీంతో ఆ స్థలంలో సీసీఎస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల బిల్డింగ్ పనులు చేపట్టారు. 2018లో ఓ వ్యక్తి ఆ ల్యాండ్లో తమకు ప్లాట్ ఉందని చెప్పి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బిల్డింగ్ వర్క్స్ మధ్యలోనే ఆపేశారు. అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తోంది. పోలీసులు ఈ ల్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిందని బోర్డు పెట్టి వదిలేశారు. సిరోంచ – -రేణిగుంట రోడ్డు ఇటుగా పోతుండటంతో ప్రస్తుతం ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే మూడెకరాలకు నలువైపులా ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే ప్రాంతంలో మెడికల్ కాలేజీ, బత్తాయి మార్కెట్, గురుకులాలకు భూములు కేటాయించారు. దీంతో పోలీసుల ల్యాండ్ కబ్జాకు రూలింగ్ పార్టీ లీడర్లు తెరలేపారు.
స్థానికుల ఫిర్యాదుతో..
పోలీసులదంటూ బోర్డు పెట్టిన భూమి కబ్జాకు గురవుతోందంటూ సోమవారం పోలీసులకు స్థానికుల నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని విచారించారు. ఆ వ్యక్తి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ లీడర్ పేరు చెప్పడంతో పోలీసులు ఆయనకు ఫోన్ చేశారు. ఆ లీడర్ తనకు పోలీసుల భూమి కబ్జాతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం ల్యాండ్దగ్గరకు వెళ్లారు. అక్కడ నిర్మాణాలు కనిపించడంతో డోజర్పెట్టి వాటిని తొలగింపజేశారు. ‘అది పోలీస్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అని, ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని’ అక్కడున్నవారిని హెచ్చరించారు. మరోవైపు ఆ ల్యాండ్ గవర్నమెంట్దని భావించిన కాంట్రాక్టర్లు రోడ్డు వెడల్పులో భాగంగా తవ్విన మట్టినంతా తీసుకొచ్చి అక్కడ గుట్టలుగా పోస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు సీరియస్గా స్పందించి ఆ
కాంట్రాక్టర్ను హెచ్చరించారు.
నిర్మాణాలు చేపట్టొద్దు
డిపార్ట్మెంట్కు కేటాయించిన ల్యాండ్ అది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. వాళ్లు ఏదో హడావుడి చేయబోతే కోర్టులో తేలేవరకు ఆగాలని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పాం. ఆ ప్లేస్లో బండలు, రాళ్లు తోలితే డోజర్ పెట్టి తీసేయించాం.
– వెంకటేశ్వరరెడ్డి, డీఎస్పీ, నల్గొండ