బిజినెస్ డెస్క్, వెలుగు: నెల వారీ జీఎస్టీ వసూళ్లు వరసగా ఆరో నెలలోనూ రూ. 1.4 లక్షల కోట్ల మార్క్ను దాటేశాయి. ఆగస్టులో రూ. 1,43,612 కోట్లను జీఎస్టీ కింద ప్రభుత్వం సేకరించింది. కిందటేడాది ఆగస్టులో నమోదైన జీఎస్టీ వసూళ్లతో (రూ.1,12,020 కోట్లతో) పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువని ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొంది. డిమాండ్ పెరగడంతో పాటు జీఎస్టీ ట్యాక్స్ రేట్లను పెంచడం, ట్యాక్స్ రూల్స్ను మెరుగ్గా అమలు చేస్తుండడంతో జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయని వివరించింది. ఫెస్టివ్ సీజన్ స్టార్టవ్వడంతో రానున్న నెలల్లోనూ జీఎస్టీ వసూళ్లు ఎక్కువగానే ఉంటాయని అంచనా. ఎకానమీ రికవరీ అవుతుండడంతో జీఎస్టీ వసూళ్లు నిలకడగా పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో రూ. 1,43,612 కోట్లు జీఎస్టీ కింద రాగా, ఇందులో రూ.24,710 కోట్లు సెంటర్ జీఎస్టీ (సీజీఎస్టీ) కింద వచ్చాయి.
స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) కింద రూ. 30,951 కోట్ల రెవెన్యూ వచ్చిందని, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) కింద రూ.77,782 కోట్లు వచ్చాయని ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఈ ఐజీఎస్టీలో దిగుమతులపై సేకరించిన రూ. 42,067 కోట్లు కూడా కలిసి ఉన్నాయి. సెస్ కింద రూ. 10,168 కోట్లు రాగా ఇందులో దిగుమతులపై సేకరించిన రూ. 1,018 కోట్లు కలిసి ఉన్నాయని ఈ మినిస్ట్రీ వెల్లడించింది. కిందటేడాది జనవరి–ఆగస్టు మధ్య సేకరించిన జీఎస్టీ కలెక్షన్స్తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–ఆగస్టు మధ్య సేకరించిన జీఎస్టీ వసూళ్లు 33 శాతం ఎక్కువ. కాగా, ఆగస్టు జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది జులైలో వచ్చిన రూ. 1.49 లక్షల కోట్లతో పోలిస్తే తక్కువ. ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డ్ లెవెల్లో రూ. 1.67 లక్షల కోట్లు వచ్చాయి.
జీడీపీ పైకి..
మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం, దేశ జీడీపీ ఈ ఏడాది జూన్తో ముగిసిన క్వార్టర్లో 13.5 శాతం గ్రోత్ రేటును నమోదు చేసింది. అంతకు ముందు క్వార్టర్లో జీడీపీ గ్రోత్ రేటు 4.1 శాతంగా రికార్డయ్యింది. లో బేస్ కావడంతో పాటు ఎకానమీ రికవరీ అవుతుండడంతో జీడీపీ గ్రోత్ ఎక్కువగా పెరిగిందని ఎనలిస్టులు చెబుతున్నారు. కానీ, ఈ జూన్ క్వార్టర్లో జీడీపీ గ్రోత్ రేటు 15 శాతంగా ఉంటుందని ఎక్స్పర్టులు, 16.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. ఈ అంచనాల కంటే తక్కువగా జీడీపీ గ్రోత్ నమోదు కావడాన్ని గమనించాలి. అయినప్పటికీ దేశ జీడీపీ గ్రోత్ రేటు ఒక క్వార్టర్లో ఇంతలా పెరగడం ఇది రెండోసారి మాత్రమే. కిందటేడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో జీడీపీ గ్రోత్ రేటు 20.1 శాతంగా నమోదయ్యింది. కరోనా వలన 2020 ఏప్రిల్–జూన్ క్వార్టర్లో జీడీపీ గ్రోత్ నెగెటివ్లోకి జారుకోవడంతో 2021 జూన్ క్వార్టర్లో జీడీపీ గ్రోత్ రేటు ఎక్కువగా నమోదయ్యింది.
తయారీ రంగం జోరు..
ఈ ఏడాది జులైలో ఎనిమిది నెలల గరిష్టానికి చేరుకున్న దేశ తయారీ రంగం యాక్టివిటీ ఆగస్టులో కొద్దిగా తగ్గింది. అయినప్పటికీ, కిందటేడాది ఆగస్టుతో పోలిస్తే మాత్రం మెరుగ్గా రికార్డయ్యింది. తయారీ రంగం పనితీరును కొలిచే ఎస్ అండ్ పీ గ్లోబల్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 56.2 గా నమోదయ్యింది. జులైలో ఇది 56.4 గా ఉంది. 50 కంటే ఎక్కువగా ఉంటే తయారీ రంగం పనితీరు మెరుగవుతున్నట్టు.
2023 లో జీడీపీ గ్రోత్ రేటు 5.2%
వడ్డీ రేట్లు పెరగడంతో పాటు, గ్లోబల్గా ఎకానమీ గ్రోత్ నెమ్మదించడం, అధిక వర్షాలు వంటి కారణాలతో ఈ ఏడాది దేశ జీడీపీ గ్రోత్ రేటు 7.7 శాతంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనావేసింది. కిందటేడాది నమోదైన 8.3 శాతం నుంచి తగ్గించింది. వచ్చే ఏడాది (జనవరి–డిసెంబర్) దేశ జీడీపీ గ్రోత్ రేటు అంచనాలను కూడా 5.4 శాతం నుంచి 5.2 శాతానికి మూడీస్ తగ్గించింది. ‘మా అంచనాల ప్రకారం దేశ జీడీపీ గ్రోత్ రేటు కిందటేడాది నమోదైన 8.3 శాతం నుంచి ఈ ఏడాది 7.7 శాతానికి తగ్గుతుంది. అక్కడి నుంచి ఇంకా తగ్గి వచ్చే ఏడాది 5.2 శాతంగా నమోదవుతుంది. పెరిగిన వడ్డీ రేట్లు, వర్షాకాలం సరిగ్గా లేకపోవడం, గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్లో ఉండడం వంటి అంశాలు దేశ ఎకానమీ గ్రోత్పై ప్రభావం చూపుతాయని భావిస్తున్నాం’ అని మూడీస్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.