సిడ్నీ: వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బంది పడుతున్న ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ మరో టోర్నీకి రెడీ అయ్యారు. మంగళవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 21 నుంచి డెన్మార్క్లో జరిగే వరల్డ్ చాంపియన్షిప్స్కు ముందు ఫామ్లోకి రావడానికి సింధు, శ్రీకాంత్కు ఇదే చివరి టోర్నీ కానుంది.
ఐదో సీడ్ సింధు తొలి రౌండ్లో ఇండియాకే చెందిన అష్మితా చాలిహాతో పోటీ పడనుంది. ఆకర్శి కశ్యప్, మాళవిక, తస్నిమ్ మీర్ కూడా బరిలో ఉన్నారు. 2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన శ్రీకాంత్కు తొలి రౌండ్లో జపాన్కు చెందిన 11 ర్యాంకర్ కెంటా నిషిమోటాతో సవాల్ ఎదురవనుంది. మరో సీనియర్ షట్లర్ హెచ్ఎస్ప్రణయ్ హాంకాంగ్కు చెందిన లీ చెయుక్తో పోటీ పడనుండగా.. లక్ష్యసేన్ తోటి ఆటగాడు కిరణ్ జార్జ్తో పోరు ఆరంభించనున్నాడు. రజావత్, మిథున్, విమెన్స్ డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ, మిక్స్డ్లో సిక్కిరెడ్డి–రోహన్ కపూర్ పోటీలో ఉన్నారు.