
ఆన్లైన్ అడ్డాగా సాగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. సైబర్ సేఫ్టీపై పోలీసులు ప్రచారం చేస్తున్నా.. మోసపోతున్నోళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇటీవల హైదరాబాద్ లో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కొరియర్లో పార్సిల్ వచ్చిందంటూ ఫోన్ కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఈ తరహా మోసాలకు బలవుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కర్నాటకకు చెందిన బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు, మెట్రో సిటీలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకుంటున్నారు. డార్క్ వెబ్ సైట్లలో కొనుగోలు చేసిన ఫోన్ నెంబర్స్, ఏజెన్సీల ద్వారా సేకరించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలతో మోసాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఫెడెక్స్ కొరియర్, కస్టమ్స్, ట్రాయ్, సీబీఐ, సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో డిజిటల్ అరెస్ట్ చేస్తూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఫెడెక్స్ కొరియర్లో వచ్చిన పార్సిల్లో డ్రగ్స్, బంగారం, నిషేధిత వస్తువులు ఉన్నాయని ఢిల్లీ, ముంబై పోలీసుల పేరుతో స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటూ అర్ధరాత్రి గంటల తరబడి వేధింపులకు గురిచేస్తున్నారు. అరెస్ట్ చేస్తామని బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.
Also Read:-సింగరేణి కార్మికుల ఆందోళన.. ఎస్టీపీసీ క్యాంటీన్ మూసివేత
90 శాతం మంది విద్యావంతులే..
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ఫోన్స్ ఉంటున్నాయి. అన్ లిమిటెడ్ మొబైల్ డేటా, లక్షల సంఖ్యలో యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బెస్ట్ కనెక్టివిటీకి నిలయంగా మారాయి. అలాగే కరెన్సీ నోట్లకు బదులు డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. వీటన్నింటినీ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
సోషల్ మీడియాలో బాధితులను ట్రాప్ చేసి, ఆ తర్వాత లింక్స్ పంపించి.. వాళ్ల బ్యాంక్ అకౌంట్లను కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ వేదికగా దాదాపు 185 రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కామన్మెన్ నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ప్రతిఏటా నమోదవుతున్న సైబర్ నేరాల బాధితుల్లో 90 శాతం మంది విద్యావంతులే ఉంటున్నారు.