న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఇండస్ట్రీకి త్వరలోనే మంచిరోజులు రాబోతున్నాయి. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా 24 రోజులపాటు పండగలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో అమ్మకాలు జోరందుకుంటాయని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (ఫాడా) తెలిపింది. ప్యాసింజర్ వెహికల్ (పీవీ) సెగ్మెంట్లో ఈ నెలలో మరింత ఎక్కువగా అమ్మకాలు జరిగే అవకాశం ఉందని, ఈ పదేళ్లలో ఇదే తమకు బెస్ట్ ఫెస్టివ్ సీజన్ అని డీలర్లు అంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆటోమొబైల్ రంగం మొత్తం రిటైల్ అమ్మకాలు సంవత్సరానికి 11 శాతం పెరిగాయి. తయారీదారుల నుంచి సరఫరాలు మెరుగుపడ్డాయి. విడిభాగాల కొరత తీరిపోయింది.
పండుగ కాలంలో కస్టమర్లకు వేగంగా డెలివరీలను ఇవ్వడానికి డీలర్లకు ఓకే చెప్పాయి. ఈ విషయమై ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ, "2022 సెప్టెంబర్ నెలలో ఆటో రిటైల్ సెగ్మెంట్ మొత్తం 11 శాతం గ్రోత్ని సాధించింది. సెప్టెంబర్ 10-–25 నుంచి చెడ్డరోజులు ఉంటాయి కాబట్టి కొనుగోళ్ల చాలా తక్కువగా ఉంటాయి. సెప్టెంబర్ 26 న నవరాత్రితో ప్రారంభమైన పండుగ కాలం అక్టోబరు వరకు కొనసాగుతుంది. అప్పటి నుంచి అమ్మకాలు బాగుంటాయి" అని ఆయన వివరించారు. సెప్టెంబరులో ట్రాక్టర్లు మినహా మిగిలిన అన్ని కేటగిరీలు అమ్మకాలు బాగున్నాయని ఫాడా రిపోర్టు పేర్కొంది. టూవీలర్స్, త్రీవీలర్స్, ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ), కమర్షియల్ వెహికల్స్ (సీవీ) అమ్మకాలు వరుసగా 9 శాతం, 72 శాతం, 10 శాతం, 19 శాతం పెరిగాయి. 2019 సెప్టెంబర్ తో పోలిస్తే పీవీ సెగ్మెంట్ 44 శాతం గ్రోత్తో పరుగును కొనసాగించింది. త్రీ వీలర్, ట్రాక్టర్, సీవీలలో గ్రోత్ వరుసగా 6 శాతం, 37 శాతం 17 శాతం పెరిగింది. టూవీలర్ సెగ్మెంట్ మాత్రమే 14 శాతం పడిపోయింది.