
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో రూ.5,864 కోట్లకు పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చిన రూ.5,330 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. బ్యాంక్ నికర లాభం ఎనలిస్టులు వేసిన అంచనా రూ.5,698 కోట్లను దాటింది. యాక్సిస్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.12,135 కోట్లకు పెరగగా, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (ఎన్ఐఎం) 4.11 శాతానికి పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంక్కు రూ. 11, 908 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. ఎన్ఐఎం మార్జిన్ 3.96 శాతంగా రికార్డయ్యింది.
కాంటెంజెన్సీల ప్రొవిజన్లు సెప్టెంబర్ క్వార్టర్లో రూ.815 కోట్లుగా ఉన్నాయి. మొండిబాకీల కోసం రూ.1,010 కోట్లను యాక్సిస్ బ్యాంక్ పక్కన పెట్టింది. బ్యాంక్ మొండిబాకీలు తగ్గాయి. గ్రాస్ ఎన్పీఏల రేషియో కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్లో 2.5 శాతం ఉండగా తాజా సెప్టెంబర్ క్వార్టర్లో 1.73 శాతానికి మెరుగయ్యింది. మరోవైపు నెట్ ఎన్పీఏల రేషియో 0.51 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గింది.
రైటాఫ్ చేసిన అకౌంట్ల నుంచి రూ.664 కోట్లను రికవరీ చేశామని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. బ్యాంక్ ఇచ్చిన అప్పులు సెప్టెంబర్ క్వార్టర్లో రూ.8.97 లక్షల కోట్లకు పెరిగాయి. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే ఇది 23 శాతం గ్రోత్కు సమానం. బ్యాంక్ రిటైల్ లోన్లు 23 శాతం పెరిగి రూ.5.19 లక్షల కోట్లకు చేరుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్ షేరు బుధవారం 0.77 శాతం తగ్గి రూ.957 దగ్గర క్లోజయ్యింది