
- మరోసారి ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్
ముంబై : ఫుట్ ఐటమ్స్ రేట్ల పెరుగుదల మరోసారి షాక్ ఇస్తుందనే అంచనాతోనే కీలక రేట్లలో ఎలాంటి మార్పులు వద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఆర్బీఐ ఎంపీసీ) నిర్ణయించింది. ఈ నెల 8–10 తేదీల మధ్యలో ఎంపీసీ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ మినిట్స్ను ఆర్బీఐ గురువారం విడుదల చేసింది. టమాటాలతో పాటు, ఇతర కూరగాయల రేట్లు పెరగడంతో రెపో రేటును 6.5 శాతం వద్దే అట్టే పెట్టాలని ఆర్బీఐ నిర్ణయించింది.
ఎంపీసీలోని ఆరుగురు మెంబర్లూ ఈ ప్రపోజల్కే అనుకూలంగా ఓటేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ ఎంపీసీలో గవర్నర్ శక్తికాంత్ దాస్ తో పాటు, ఎం డీ పాత్ర, శశాంక భిడే, ఆషిమా గోయెల్, జయంత్ ఆర్ వర్మ, రాజీవ్ రంజన్లు మెంబర్లు. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం తర్వాత రిలీజైన కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) డేటా జులై నెలలో రిటెయిల్ ఇన్ఫ్లేషన్ 15 నెలల గరిష్టానికి అంటే, 7.44 శాతానికి చేరినట్లు తేలింది. ఆర్బీఐ అప్పర్లిమిట్6 శాతానికి మించి ఇన్ఫ్లేషన్ ఈ లెవెల్లో పెరగడం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇదే మొదటిసారి. దేశంలో రిటెయిల్ ఇన్ఫ్లేషన్ 4 శాతానికి మించకుండా చూడమని ప్రభుత్వం ఆర్బీఐని ఆదేశించింది.
ఇన్ఫ్లేషన్పై యుద్ధం ఇంకా ముగియలేదని ఎంపీసీ మీటింగ్లో గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నట్లు మినిట్స్ వెల్లడించాయి. కూరగాయల రేట్ల పెరుగుదల తాత్కాలికమే అయినప్పటికీ, ప్రభావాన్ని తక్కువ చేసి చూడలేమని ఎంపీసీ అభిప్రాయపడింది. ఎల్నినో పరిస్థితుల కారణంగానే కూరగాయలతోపాటు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ రేట్లు ఆకస్మికంగా పెరిగినట్లు వివరించింది. మరోసారి ఫుడ్ ఐటమ్స్ రేట్లు పెరిగితే వచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి రెడీగా ఉండాలని గవర్నర్ శక్తికాంత్ దాస్ సూచించారు. జులై–ఆగస్టులలో ఇన్ఫ్లేషన్ పెరిగే సూచనలున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర కూడా పేర్కొన్నారు.
ఇన్ఫ్లేషన్ను దించడానికి కోర్ ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంచడం తప్పనిసరని అన్నారు. తాత్కాలికమైన సప్లయ్–డిమాండ్ అంతరాలు మానిటరీ పాలసీలో నేరుగా భాగం కాకపోయినప్పటికీ, ధరలను నిలకడగా అట్టేపెట్టడమనేది రిజర్వ్ బ్యాంకుకు చాలా ముఖ్యమైనదని మైఖేల్ పాత్ర చెప్పారు. ఇన్ఫ్లేషన్ విషయంలో ఇంకా జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్ పేర్కొన్నారు. తాత్కాలికంగా కొన్ని వస్తువుల ధరలు పెరగడం ఇబ్బంది కాకపోయినప్పటికీ, ఈ పెరుగుదల అన్ని వస్తువులలోనూ కనబడటం సమస్యే అవుతుందని మెంబర్ శశాంక భిడే ఎంపీసీ మీటింగ్లో పేర్కొన్నట్లు మినిట్స్ వెల్లడించాయి.