ఫుడ్​ ఐటమ్స్​ రేట్ల షాక్ ​వల్లే రేట్లు మార్చలే.. ఎంపీసీ మినిట్స్​లో వెల్లడి

ఫుడ్​ ఐటమ్స్​ రేట్ల షాక్ ​వల్లే రేట్లు మార్చలే.. ఎంపీసీ మినిట్స్​లో వెల్లడి
  • మరోసారి ఇన్​ఫ్లేషన్​ పెరిగే ఛాన్స్​     

ముంబై : ఫుట్​ ఐటమ్స్​ రేట్ల పెరుగుదల మరోసారి షాక్​ ఇస్తుందనే అంచనాతోనే కీలక రేట్లలో ఎలాంటి మార్పులు వద్దని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఆర్​బీఐ ఎంపీసీ) నిర్ణయించింది. ఈ నెల 8–10 తేదీల మధ్యలో ఎంపీసీ మీటింగ్​ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్​ మినిట్స్​ను ఆర్​బీఐ గురువారం విడుదల చేసింది. టమాటాలతో పాటు, ఇతర కూరగాయల రేట్లు పెరగడంతో రెపో రేటును 6.5 శాతం వద్దే అట్టే పెట్టాలని ఆర్​బీఐ నిర్ణయించింది.

ఎంపీసీలోని ఆరుగురు మెంబర్లూ  ఈ ప్రపోజల్​కే అనుకూలంగా ఓటేసినట్లు ఆర్​బీఐ వెల్లడించింది. ఆర్​బీఐ ఎంపీసీలో గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ తో పాటు, ఎం డీ పాత్ర, శశాంక భిడే, ఆషిమా గోయెల్​, జయంత్​ ఆర్​ వర్మ, రాజీవ్​ రంజన్​లు మెంబర్లు. ఆర్​బీఐ ఎంపీసీ సమావేశం తర్వాత రిలీజైన కన్జూమర్​ ప్రైస్​ ఇండెక్స్​ (సీపీఐ) డేటా జులై నెలలో  రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​ 15 నెలల గరిష్టానికి అంటే, 7.44 శాతానికి చేరినట్లు తేలింది. ఆర్​బీఐ అప్పర్​లిమిట్​6 శాతానికి మించి ఇన్​ఫ్లేషన్​ ఈ లెవెల్​లో పెరగడం ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో ఇదే మొదటిసారి. దేశంలో రిటెయిల్​ ఇన్​ఫ్లేషన్​ 4 శాతానికి మించకుండా చూడమని ప్రభుత్వం ఆర్​బీఐని ఆదేశించింది.

ఇన్​ఫ్లేషన్​పై యుద్ధం ఇంకా ముగియలేదని ఎంపీసీ మీటింగ్​లో గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ పేర్కొన్నట్లు మినిట్స్​ వెల్లడించాయి. కూరగాయల రేట్ల పెరుగుదల తాత్కాలికమే అయినప్పటికీ, ప్రభావాన్ని తక్కువ చేసి చూడలేమని ఎంపీసీ అభిప్రాయపడింది. ఎల్​నినో పరిస్థితుల కారణంగానే కూరగాయలతోపాటు, కొన్ని ఫుడ్​ ఐటమ్స్​ రేట్లు ఆకస్మికంగా పెరిగినట్లు వివరించింది. మరోసారి ఫుడ్​ ఐటమ్స్​ రేట్లు పెరిగితే వచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి రెడీగా ఉండాలని గవర్నర్​ శక్తికాంత్​ దాస్​ సూచించారు. జులై–ఆగస్టులలో ఇన్​ఫ్లేషన్​ పెరిగే సూచనలున్నాయని ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​ మైఖేల్​ పాత్ర కూడా పేర్కొన్నారు.

ఇన్​ఫ్లేషన్​ను దించడానికి కోర్​ ఇన్​ఫ్లేషన్​ అదుపులో ఉంచడం తప్పనిసరని అన్నారు. తాత్కాలికమైన సప్లయ్​–డిమాండ్​ అంతరాలు మానిటరీ పాలసీలో నేరుగా భాగం కాకపోయినప్పటికీ, ధరలను నిలకడగా అట్టేపెట్టడమనేది రిజర్వ్​ బ్యాంకుకు చాలా ముఖ్యమైనదని మైఖేల్​ పాత్ర చెప్పారు. ఇన్​ఫ్లేషన్​ విషయంలో ఇంకా జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉందని ఆర్​బీఐ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ రాజీవ్​ రంజన్​ పేర్కొన్నారు. తాత్కాలికంగా కొన్ని వస్తువుల ధరలు పెరగడం ఇబ్బంది కాకపోయినప్పటికీ, ఈ పెరుగుదల అన్ని వస్తువులలోనూ కనబడటం సమస్యే అవుతుందని మెంబర్​ శశాంక భిడే ఎంపీసీ మీటింగ్​లో పేర్కొన్నట్లు మినిట్స్​ వెల్లడించాయి.