న్యూఢిల్లీ : యూపీ లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుడు బెయిల్పై బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. కేసు విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెంటనే స్టేటస్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సిట్ కేసును బలంగా ప్రెజెంట్ చేయనందునే అలహాబాద్ కోర్టు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిందని అడ్వొకేట్ శివ కుమార్ ఆరోపించారు. కేసులో ప్రధాన నిందితుడు దర్జాగా బయట తిరుగుతుండగా.. బాధిత కుటుంబాలు భయంతో బతుకుతున్నాయని అన్నారు.
లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ గురువారం బెయిల్ మంజూరు చేసింది. గతేడాది అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.