- సప్లై చేస్తున్న ముగ్గురు అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: ఆంధ్రప్రదేశ్ నుంచి హ్యాష్ ఆయిల్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముగ్గురిని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు.. మేడ్చల్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. వివరాలను మేడ్చల్ ఇన్చార్జి డీసీపీ శ్రీనివాస్రావు ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఏపీలోని గోలుగుంటకి చెందిన గొల్లు కుమారస్వామి (21) బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చాడు. గండిమైసమ్మలోని ఓ ఫార్మా కంపెనీలో మెకానిక్గా పనిచేస్తున్నాడు.
చెడు అలవాట్లకు బానిసై అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందు కోసం ఏపీ నుంచి హ్యాష్ ఆయిల్ను హైదరాబాద్కి తెచ్చి స్టూడెంట్లు, కార్మికులకు విక్రయించడానికి ప్లాన్ చేశాడు. తునికి చెందిన హ్యాష్ ఆయిల్ సప్లయ్ చేసే నాగేశ్వరావు అలియాస్ నాగుని సంప్రదించాడు. అతడు హ్యాష్ ఆయిల్ సరఫరా చేయడానికి ఒప్పుకున్నాడు.
దీంతో కుమారస్వామి తన మిత్రుడైన గోలుగుంటకి చెందిన కోడి అజయ్ కుమార్ (41) డ్రైవర్ని సంప్రదించి నాగు నుంచి హ్యాష్ ఆయిల్ తీసుకుని తనకు అందజేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుమారస్వామి సూచనల ప్రకారం శుక్రవారం అజయ్కుమార్.. తన మిత్రుడైన స్వామి గణేష్తో కలిసి తునికి బైక్ పై వెళ్లి నాగు నుంచి హ్యాష్ ఆయిల్ తీసుకుని శనివారం రాత్రి హైదరాబాద్కి వచ్చారు. కుమారస్వామిని కలిసి మేడ్చల్ వైపు బయలుదేరుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.12.30 లక్షల విలువైన 2.2 లీటర్ల హ్యాష్ ఆయిల్, 3 మొబైల్ ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి తెచ్చి సరఫరా
హిమాచల్ప్రదేశ్ నుంచి హ్యాష్ ఆయిల్ తెచ్చి విద్యార్థులకు అమ్ముతున్న ఓ వ్యక్తిని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని దుండిగల్ పోలీసులకు అప్పగించారు. దుండిగల్ మల్లంపేటకు చెందిన కనగల ఉదయ్కుమార్ (29) డాగ్ బ్రీడర్గా పనిచేస్తున్నాడు. అక్రమ సంపాదనకు అలవాటుపడి హిమాచల్ ప్రదేశ్నుంచి హ్యాష్ ఆయిల్ తెచ్చి స్టూడెంట్లకు అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు ఉదయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 94 గ్రాముల హ్యాష్ ఆయిల్, మొబైల్ ఫోన్, రూ.11 వేలు స్వాధీనం చేసుకున్నారు.