కేసీఆర్ పంపిన పైసలను కర్నాటకలో కాంగ్రెస్ పంచుతోంది : బండి సంజయ్ 

కేసీఆర్ పంపిన పైసలను కర్నాటకలో కాంగ్రెస్ పంచుతోంది : బండి సంజయ్ 

కర్నాటక ఎన్నికల్లో ఒక ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన డబ్బులతోనే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పంపిణీ  చేసేందుకు సిద్ధమైందన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో లేదని, ఆ పార్టీ ఖేల్ ఖతం... దుకాణం బంద్ కాబోతోందన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతుంటే జాతీయ పార్టీ పెట్టి పోటీ చేస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో తిరుగుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. 

రాబోయే రోజుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే... పాకిస్తాన్ వెళ్లి కేసీఆర్ ప్రచారం చేస్తారేమోనని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరీబిదనూరు, బాగేపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాగేపల్లిలో పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, అసెంబ్లీ అభ్యర్థి మునిరాజుతో కలిసి ప్రచార రథంపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాదిగా జనం, కార్యకర్తలు తరలివచ్చారు. జై బీజేపీ... జైజై బండి సంజయ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగించారు. 

బండి సంజయ్ కీలక కామెంట్స్ ఇవే.. 

* మే 10వ తేదీన జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేసి గెలిపించండి. ఒక్కొక్కరు ఇతరులతో వంద ఓట్లు వేయించండి. బాగేపల్లి బీజేపీ అభ్యర్థి మునిరాజును ఎమ్మెల్యేగా గెలిపించండి. మళ్లీ విజయోత్సవ సభకు సీటీ రవితో కలిసి ఇక్కడికే వస్తా.

* ఈ ప్రాంతంలో బీజేపీకి ఓటేయకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులిస్తున్నాయి. అయినా.. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నాడు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి..?

* గత ఎన్నికల టైంలో అర్ధ రూపాయికే టీ, టిఫిన్ పెడతానన్నడు. 5 రూపాయలకే భోజనం పెడతానన్నడు.. ఆ హామీలు ఎటుపోయినయ్..? ఈ ప్రాంతంలో బార్, బీరు తప్ప అభివృద్ధి జరిగిందా..? ఒక్క ఫ్యాక్టరీ, పరిశ్రమైనా వచ్చిందా..?

* సిట్టింగ్ ఎమ్మెల్యే కరోనా టైంలో ఇంట్లో పడుకుంటే... బీజేపీ అభ్యర్థి మునిరాజు కరోనాను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేశాడు. ప్రజలను గాలికొదిలేసే నాయకుడు కావాలా..? మీ కష్టాలను పంచుకునే మునిరాజు కావాలా..? ఎన్నికలప్పుడే మీ వద్దకు వచ్చి పైసల ఆశ చూపే కాంగ్రెస్ కావాలా..? నిత్యం ప్రజల్లో ఉండే మునిరాజు కావాలా..? ఆలోచించుకోండి. 

* కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.10 వేల పంచేందుకు సిద్ధమైంది. ఆ పైసలన్నీ తెలంగాణ సీఎం కేసీఆర్ పంపినవే. వాటినే పంచేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఒక్క పైసా తక్కువ ఇచ్చినా ఊరుకోకండి. ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్ ను ఖతం చేయండి.

* కేసీఆర్ మహా తెలివైన వాడు. మొన్నటిదాకా జేడీఎస్ కు పైసలిచ్చిండు. ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలిసే సరికి కాంగ్రెస్ పంచన చేరిండు. కుమారస్వామి ఫోన్ చేసినా ఎత్తడం లేదట. కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నడు. 

* కాంగ్రెస్ ఢిల్లీలో అధికారంలో లేదు. ఈ ప్రాంతంలో గెలిస్తే ఉపయోగం ఏముంది..?  పొరపాటున ఆ పార్టీకి ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే. మునిరాజు గొప్ప నాయకుడు. ఆయనకు ఓటేస్తే దేశం కోసం, ధర్మం కోసం, అభివృద్ధి కోసం ఓటేసినట్లే.

* 80 శాతం హిందువులు ఉన్న భారత్ లో అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇన్నేళ్లు పట్టిందా..? ఎంతోమంది కర సేవకులు ప్రాణ త్యాగాలు చేయడమా..? అని ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది. కరసేవకుల బలిదానాల స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిరం నిర్మిస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు కోసం ఎంతోమంది బలిదానమయ్యారు. వారి త్యాగాలను వృథా చేయకూడదని 370 ఆర్టికల్ ను రద్దు చేసి,  జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని నిరూపించారు.

* బాగేపల్లిలో సమస్యలపై ప్రశ్నేంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారు. మీకు న్యాయం జరగాలంటే బీజేపీని గెలిపించండి. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయడంతోపాటు ఎస్సీ రిజర్వేషన్లను 15 నుండి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 5 నుండి 7 శాతానికి పెంచిన ఘనత బీజేపీదే. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే  ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లను పెంచుతారు.

* మీ నిధులు మీకు రావాలంటే బీజేపీని గెలిపించండి. అభివృద్ధి జరగాలంటే బీజేపీకే ఓటేయండి. బాగేపల్లిలో ఇంతవరకు బీజేపీ గెలవలేదు. ఈసారి ఓటేసి గెలిపించి మోడీకి గిఫ్ట్ ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తాం.