బీజేపీ నేతల అరెస్ట్ లతో కేసీఆర్ ఏమీ సాధించలేరు : బండి సంజయ్

బీజేపీ నేతల అరెస్ట్ లతో కేసీఆర్ ఏమీ సాధించలేరు : బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు కరీంనగర్ఎంపీ బండి సంజయ్. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన చేస్తున్నా... కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటి వరకూ డబుల్ బెడ్రూం కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి..? ఎన్ని కట్టారు..? లబ్ధిదారులకు ఎన్ని ఇచ్చారు..?  ఇంకా ఎన్ని కట్టాలి..? వీటంన్నిటీపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం వచ్చిన గృహాలను నిర్మించామని కేసీఆర్ నివేదిక ఇచ్చారని, లబ్ధిదారుల జాబితా ఇవ్వమంటే మాత్రం ఇవ్వడం లేదన్నారు.

డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూసేందుకు తమ పార్టీ నాయకులు వెళ్తుంటే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు బండి సంజయ్. ఇండ్లను చూడడానికే కదా వెళ్తున్నది? కూలగొట్టడానికేమీ కాదు కదా.. అన్నారు. తమ పార్టీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. అరెస్ట్ చేసిన కిషన్ రెడ్డితో సహా మిగతా నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల అరెస్ట్ ల ద్వారా కేసీఆర్ ఏమీ సాధించలేరన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ అధికారుల తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని, దీనిపై విచారణ జరుగుతోందన్నారు.