
- బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ వ్యాఖ్య
ఢాకా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న షేక్ హసీనా నోరు మూయించాలని మోదీని కోరితే ఆయన అంగీకరించలేదని చెప్పారు. లండన్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ చాథమ్ హౌస్లో జరిగిన జరిగిన ఓ కార్యక్రమంలో యూనస్ మాట్లాడారు.
బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో తాను షేక్ హసీనా అంశంపై చర్చించినట్లు చెప్పారు. " బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆమె సోషల్ మీడియా ద్వారా బంగ్లా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. దీనివల్ల బంగ్లాదేశ్లో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.
ఈ అంశంపై ఇటీవల భారత ప్రధాని మోదీతో చర్చించాను. హసీనాకు భారత్ లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడనని..అది మీ విధానపరమైన నిర్ణయమని చెప్పాను. కానీ, సోషల్ మీడియా ద్వారా హసీనా చేస్తున్న ప్రకటనలను, ప్రసంగాలను నియంత్రించాలని, అడ్డుకోవాలని మోదీని కోరాను. అయితే, అందుకు మోదీ నిరాకరించారు. అది సోషల్ మీడియా అన్ని.. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదని చెప్పారు" అని యూనస్ వెల్లడించారు.
గతేడాది బంగ్లాదేశ్ లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దాంతో అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. అప్పటి నుంచి ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. భారత్ నుంచే సోషల్ మీడియా వేదికగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.