- ఎస్సై, హోంగార్డుతో కలిసి మామూళ్ల కోసం పబ్ ఓనర్కు వేధింపులు
- పీఎస్, సీఐ ఇంట్లో సోదాలు
హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్ పీఎస్ సీఐ నరేందర్ ఏసీబీ వలలో చిక్కాడు. పబ్ నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నాడనే ఆరోపణలతో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ పీఎస్తో పాటు రోడ్ నం.4లోని నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. నరేందర్ చాంబర్లోనే దాదాపు 6 గంటల పాటు విచారించారు. ఆయనతో పాటు అడ్మిన్ ఎస్ఐ నవీన్ రెడ్డి, హోగార్డు శ్రీహరిలను కూడా ప్రశ్నించారు. క్రిమినల్ మిస్ కండక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే, సీఐ అనారోగ్యానికి గురికావడంతో ఆయనను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
మామూళ్ల దందా
బంజారాహిల్స్లోని రాక్ క్లబ్ స్కైలాంజ్ మేనేజింగ్ పార్ట్నర్గా నీల రాజేశ్వర్ లక్ష్మణ్ రావు వ్యవహరిస్తున్నాడు. ఈ పబ్పై అనేక ఆరోపణలు ఉన్నాయి. యువతులతో అశ్లీలంగా డ్యాన్స్లు చేయిస్తున్నారంటూ బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. ఇదే అదునుగా సీఐ నరేందర్ మామూళ్లకు తెరతీశాడు. జూన్ 18న రాజేశ్వర్ లక్ష్మణ్రావుతో మాట్లాడాడు. తమకు మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొదటిగా 3 నెలల కోసం రూ.4.5 లక్షలు ఇవ్వాలన్నాడు. తర్వాత ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాలని, లేదంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. గత నెల మామూళ్లు ఇవ్వకపోవడంతో 30వ తేదీ అర్ధరాత్రి సమయంలో సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్రెడ్డి పబ్ వద్దకు వెళ్లారు. లోపలికి వెళ్లకుండా పబ్ ముందు ఉన్న రోడ్డుపైనే పోలీస్ వెహికల్ ఆపారు. లక్ష్మణ్రావును బయటకురావాలని పిలిచారు. అతను బయటకు రాగానే బలవంతంగా పోలీస్ వెహికల్లో ఎక్కించుకుని పీఎస్కు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి అంతా పీఎస్లోనే నిర్బంధించారు. ఇష్టమొచ్చినట్టుగా తిట్టి, తెల్లవారుజామున వదిలేశారు. మాముళ్ల కోసం వేధింపులు ఎక్కువ కావడంతో బాధితుడు లక్ష్మణ్రావు ఏసీబీని ఆశ్రయించాడు. ఆడియో, వీడియో రికార్డింగ్స్, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను ఏసీబీ అధికారులకు అందించాడు. ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నరేందర్తో పాటు ఎస్ఐ, హోంగార్డుపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు.