ముంబై : బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన మోసపూరిత ఖాతాలను కోర్టులకు తీసుకెళ్లే వరకు విడిచిపెట్టబోమని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అంతేకాకుండా కస్టమర్లతో డైరెక్ట్గా డీల్ చేసే బ్యాంక్ ఉద్యోగులు కచ్చితంగా లోకల్ లాంగ్వేజ్లలోనే మాట్లాడాలని అన్నారు. ‘మోసపూరిత ఖాతాల నుంచి డబ్బులను రికవరీ చేయడాన్ని దాదాపు వదిలేశారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక మోసపూరిత బ్యాంక్ అకౌంట్లు కోర్టు వరకు వెళతాయి. మోసగాళ్లకు ఈ దేశంలో ప్లేస్ లేదు. వీళ్లు బ్యాంకులను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ఎగ్గొట్టిన ప్రతీ రూపాయిని తిరిగి బ్యాంక్ అకౌంట్ తీసుకొస్తాం’ అని సీతారామన్ తెలిపారు.
లాభాలు కావాలా..బోర్డుల్లో మహిళలను పెట్టుకోండి
లాభాలు పెరగాలంటే బోర్డుల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాధాన్యాన్ని పెంచడంపైన ఆమె శుక్రవారం మాట్లాడారు. ఇందులో భాగంగా 1,000 కంపెనీలను సర్వే చేసిన ఓ రిపోర్ట్ను కోట్ చేస్తూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం బోర్డులో భిన్నత్వం ఉన్న కంపెనీల ప్రాఫిట్స్ 43 శాతం ఎక్కువగా ఉన్నాయి. భిన్నత్వం లేని కంపెనీల ప్రాఫిట్స్ 29 శాతం తగ్గాయి. కంపెనీల్లో మహిళలు, మగవారి శాలరీ మధ్య తేడా ఉండడం ‘అంగీకరించరానిది’ అని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వ కంపెనీల గురించి మాట్లాడుతూ.. ‘కొంత మంది మహిళలపై పక్షపాతం చూపుతున్నారు. కార్పొరేట్ వరల్డ్లో ఈ అడ్డంకిని మహిళలు అధిగమించాలి’ అని పేర్కొన్నారు.