- అప్పులివ్వని బ్యాంకులే ఎకానమీ రికవరీకి అడ్డమా?
- బ్యాంకులు కొత్తగా అప్పులివ్వడంలేదు
- కన్జూమర్లు అప్పులకు ఎగబడటం లేదు
- ఇలా అయితే రికవరీ లేటే...అంటున్న ఎనలిస్టులు
వెలుగు బిజినెస్ డెస్క్: చిన్న, పెద్ద వ్యాపారాలు పుంజుకునేందుకు అవసరమైన డబ్బును అప్పుగా ఇవ్వడానికి దేశంలోని బ్యాంకులు ముందుకు రావడం లేదు. అంతేకాదు, వ్యక్తులకు కూడా అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధపడటం లేదు. ఫలితంగా వేగంగా రికవరీ సాధించడం కష్టమవుతుందని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. కరోనా రెండు వేవ్ల దెబ్బకి దేశంలోని చిన్న, పెద్ద వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. దీంతో ఎకానమీకి గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుడు మళ్లీ ప్రగతి బాటలోకి మళ్లాలంటే బ్యాంకుల నుంచి అప్పులు తప్పనిసరి. లిక్విడిటీ మెరుగుపడితేనే వినియోగం ఊపందుకుని, ఎకానమీ జోరందుకుంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
గత కొన్ని నెలలుగా కంపెనీలు, వ్యక్తులకు బ్యాంకులు ఇచ్చే అప్పులు 5.5 నుంచి 6 శాతం మాత్రమే పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారికి ముందుతో పోలిస్తే ఇవి సగం కూడా ఉండటం లేదు. దేశంలోని అతి పెద్ద బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంకు ఏప్రిల్ నుంచి మొదలైన ఫైనాన్షియల్ ఇయర్లో తాను ఇచ్చే అప్పులలో 10 శాతం గ్రోత్ను టార్గెట్గా పెట్టుకుంది. కానీ, ఈ టార్గెట్ను అందుకోవడం కష్టమేనంటున్నారు. ఇప్పుడున్న సిట్యుయేషన్ చాలా సున్నితమైనదని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా ఇటీవల పేర్కొన్నారు. అప్పులు ఇచ్చే టార్గెట్లను అందుకోవడానికి అసెట్ క్వాలిటీ విషయంలో రాజీ పడలేమని ఆయన స్పష్టం చేశారు.
అప్పుల టార్గెట్లు తగ్గించేస్తున్నయ్..
ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 9.5 శాతం ఎకనమిక్ గ్రోత్ను ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఈ గ్రోత్ రావాలంటే బ్యాంకుల నుంచి అప్పులు పెరగడం తప్పనిసరి. కాకపోతే, ఈ రెండూ సాధించడానికి అడ్డంకులేమిటనేది దినేష్ ఖారా మాటల్లోనే తెలిసిపోతోంది. అంతకు ముందు ఆర్బీఐ ఎకానమీ గ్రోత్ 10.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కొత్త అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడకపోవడం వల్ల ఎకానమీ రికవరీ మరింత లేట్ అవచ్చని ఆర్బీఐ సహా చాలా మంది ఎనలిస్టులు చెబుతున్నారు. ఇచ్చిన అప్పులలో మొండి బాకీలు పెరుగుతుండటంతో బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వడానికి జంకుతున్నాయి. ఎకానమీ గ్రోత్కి అప్పులనేవి చాలా ముఖ్యమని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎస్ ఎస్ ముంద్రా చెప్పారు. అప్పుల ప్రభావం నామినల్ జీడీపీ గ్రోత్పై ఉంటుందని, ఇది 1.6 రెట్ల దాకా ఉంటుందని అన్నారు.
అప్పులివ్వడం రూ. 1.7 లక్షల కోట్లు తగ్గింది..
మన దేశం ఇప్పటికే బ్యాంకుల మొండి బాకీల విషయంలో ఇబ్బందులలో ఉంది. మరోవైపు షాడో బ్యాంకింగ్గా పిలిచే ఎన్బీఎఫ్సీ రంగంలోనూ గట్టి కుదుపులే గత కొన్నేళ్లలో వచ్చాయి. ఆయా రంగాలలోని రెండు పెద్ద సంస్థలను కాపాడాల్సి వచ్చింది. మరో రెండు దివాలా తీశాయి. ఇంకోవైపు, కార్పొరేట్లు కూడా కొత్త పెట్టుబడులకు సిద్ధపడటం లేదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) చెబుతోంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతోందని పేర్కొంటోంది. ఖర్చులు తక్కువవడం వల్లే కార్పొరేట్ల ప్రాఫిట్స్ భారీగా పెరిగాయని, చేతిలో మిగిలిన డబ్బును బ్యాంకు లోన్లను తీర్చేందుకు కార్పొరేట్లు వాడాయని వివరిస్తోంది. దేశంలోని 15 టాప్ సెక్టార్లలోని 1000 లిస్టెడ్ కంపెనీలు ఏకంగా రూ. 1.70 లక్షల కోట్ల అప్పులను తగ్గించుకున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ డేటా చెబుతోంది. రిఫైనరీలు, స్టీల్, ఫెర్టిలైజర్లు, మైనింగ్, మినరల్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్ రంగాలలోని కంపెనీలే తమ అప్పులను రూ. 1.50 లక్షల కోట్ల మేర తగ్గించుకున్నాయి. ఇదే ట్రెండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనూ కొనసాగుతుందని ఎస్బీఐ చీఫ్ ఎకానమిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ ఇటీవల తన రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు కరోనా వలన ఎక్కువగా నష్టపోయిన టూరిజం, ఏవియేషన్, రెస్టారెంట్ సెక్టార్లలోని కంపెనీలకు అప్పులివ్వడానికి ఫైనాన్షియల్ సంస్థలు భయపడుతున్నాయి. ఈ సెక్టార్లలో అప్పులు మొండిబాకీలుగా మారే అవకాశం ఎక్కువని అంచనావేస్తున్నాయి.
రిటెయిల్ లోన్లు పెరగడం కష్టమే!
క్రెడిట్ డిమాండ్ పెరగాలంటే ప్రైవేటు (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) పెట్టుబడుల సైకిల్లో పెద్ద మార్పులే రావాల్సి ఉంటుందని నిర్మల్ బంగ్ ఈక్విటీస్ ఎకానమిస్ట్ తెరెసా జాన్ తెలిపారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జీడీపీ గ్రోత్ 7 శాతంగా ఉండొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. అయితే, బ్లూమ్బర్గ్ సర్వేలో ఎక్కువ మంది ఎనలిస్టులు జీడీపీ గ్రోత్ 9.2 శాతంగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కన్జూమర్లు కూడా తమ ఫైనాన్సెస్కు రిపెయిర్లు చేసుకుంటున్నారని, దీంతో రిటెయిల్ లోన్స్ డిమాండ్ పుంజుకోవడం కష్టమేనని, దీని ఎఫెక్ట్ ఎకనమిక్ గ్రోత్పై పడుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తన రిపోర్టులో తెలిపింది. కన్జూమర్లు పెద్దగా ఖర్చు పెట్టేందుకు ఇష్టపడటం లేదని ఈ రిపోర్టులో పేర్కొంది. ఎకానమీకి ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశమేనని వివరించింది.