
- కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా నివాళి
బషీర్బాగ్, వెలుగు: వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని చాటాలని యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతి లో శుక్రవారం నిర్వహించిన దొడ్డి
కొమురయ్య 79వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మొదట దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన తొలి రైతాంగ పోరాట అమరుడు దొడ్డి కొమురయ్య అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసిన చారిత్రక రైతాంగ పోరాటానికి ఊపిరి పోశా రని, ఆయన త్యాగం చిరస్మరణీయం అని పేర్కొన్నారు. వెనుకబడిన కులాలను అభివృద్ధి చేసే దిశగా రాహుల్ గాంధీ కులగణన డిమాండ్ను ఎత్తుకున్నారని, అందుకు తొలి అడుగు తెలంగాణలో పడిందన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలాగా సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు.
రోశయ్యది మంచి వ్యక్తిత్వం
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్యది మంచి వ్యక్తిత్వమని మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. సీఎంగా, ఫైనాన్స్ మినిస్టర్ గా రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా పనిచేశారని చెప్పారు. అసెంబ్లీలో నిర్వహించిన రోశయ్య 92వ జయంతి కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొని, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా రోశయ్య పనిచేశారని పేర్కొన్నారు. తమ నాన్న కాకా వెంకటస్వామితో ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారని, కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఎలా పని చేయాలి? అని ఎప్పుడూ ఆలోచించేవారని తెలిపారు.
వరంగల్ ఎయిర్పోర్ట్ కు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి
వరంగల్ ఎయిర్పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకూ తాను 3 దొడ్డి కొమురయ్య విగ్రహాలను అందజేసినట్లు చెప్పారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ , పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నివాళి అర్పించారు.