
- బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ర్యాంకులు
హైదరాబాద్, వెలుగు: జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల స్టూడెంట్లు సత్తా చాటారు. బీసీ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చదువుతున్న జి.అరుణ్ 364, పి.సంపత్ కుమార్ 1067, బి.దిలీప్ 1870వ ర్యాంకు సాధించారు. టి.చిత్ర 424, ఎం.అఖిల 1205, ఎం. సుజాత 1424, ఎం.సాయిశ్రీ 3535 ర్యాంకులు సాధించారని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ గురుకులాల నుంచి మొత్తం 492 మంది జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు రాయగా 97 మందికి డైరెక్ట్ ర్యాంకులు వచ్చాయని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ప్రకటించారు.
గౌలిదొడ్డిలోని ఎస్సీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) బాలుర కాలేజీకి చెందిన అనపర్తి రాజశేఖర్ 166వ ర్యాంకు, మడికొండ సీఓఈకి చెందిన గోలి సింధూజ 336, షేక్ పేట గురుకులానికి చెందిన దుర్గం చరణ్ 743, నార్సింగి సీఓఈ ప్రియాంక 1019, గౌలిదొడ్డి బాలికల గురుకులానికి చెందిన అమృత 1156, నిహారిక 1249, రాథోడ్ అశోక్ (పీడబ్ల్యూడీ కేటగిరిలో) 82వ ర్యాంకు పొందారు. ఇక ఎస్టీ విభాగంలో చిలుకూరుకు చెందిన ఠాకూర్ 648, నల్లకంచె సీఓఈ గీతిక 905వ ర్యాంకు సాధించారు. ర్యాంకర్లకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ అభినందనలు తెలిపారు.