
కౌలాలంపూర్ వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 2) జరిగిన మహిళల అండర్ 19 ప్రపంచ కప్ ను టీమిండియా గెలుచుకుంది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలిచి విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయానందాన్ని రెట్టింపు చేస్తూ బీసీసీఐ మహిళాల జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. భారత జట్టుతో పాటు సహాయక సిబ్బందికి కలిపి ఆదివారం రూ. 5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రపంచ కప్ విజయంపై భారత జట్టుకు ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు భారతః మాజీ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు.
మలేసియా గడ్డపై అజేయ యాత్రను కొనసాగించిన అమ్మాయిల జట్టు ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి రెండోసారి కప్పు సొంతం చేసుకుంది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో టాస్ నెగ్గి బ్యాటింగ్కు వచ్చిన సఫారీ టీమ్ తొలుత 20 ఓవర్లలో 82 రన్స్కే ఆలౌటైంది. మీకె వాన్ వూర్స్ట్ (23) టాప్ స్కోరర్. ఆమెతో పాటు జెమ్మా బోథా (16), ఫే కౌలింగ్ (15), కరబో మెసో (10) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. త్రిషతో పాటు పరుణిక సిసోడియా (2/6), ఆయుషి శుక్లా (2/9), వైష్ణవి శర్మ (2/23) తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read : టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్ విజేతగా ప్రజ్ఞానంద్
అనంతరం త్రిష, సానికా చాల్కె (22 బాల్స్లో 4 ఫోర్లతో 26 నాటౌట్) మెరుపులతో ఇండియా 11.2 ఓవరల్లోనే 84/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. టోర్నీలో గొప్పగా ఆడి టాప్ స్కోరర్గా నిలిచిన త్రిష ఫైనల్లోనూ చెలరేగింది. బౌలింగ్లో 3 వికెట్లు పడగొట్టి.. బ్యాటింగ్లోనూ సత్తా చాటి జట్టును గెలిపించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు టోర్నమెంట్ అవార్డులు అందుకుంది.