- బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ
హైదరాబాద్: ఐపీఎల్–14కు హైదరాబాద్ ఆతిథ్యమిచ్చే చాన్సుందనే వార్తలొచ్చి 24 గంటలు గడవకముందే బీసీసీఐ ఆ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. ముంబై వేదికగా జరిగే మ్యాచ్లను వేరే సిటీకి తరలించే ఆలోచనే లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తేల్చి చెప్పాడు. మహారాష్టలో కరోనా సిచ్యువేషన్ ఎలా ఉన్నా షెడ్యూల్ ప్రకారమే ముంబైలో మ్యాచ్లు జరుగుతాయన్నాడు. ముంబై వాంఖడే స్టేడియం గ్రౌండ్ స్టాఫ్తోపాటు పలువురు ఈవెంట్ ఆర్గనైజర్స్ కరోనా పాజిటివ్గా తేలడంతో ఐపీఎల్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోపక్క మహారాష్ట్ర గవర్నమెంట్ లాక్డౌన్ ఆలోచన చేస్తుండటంతో ముంబై వేదికగా జరగబోయే మ్యాచ్లు తరలింపు ఖాయమనే వార్తలొచ్చాయి. దీంతో బ్యాకప్ వెన్యూగా ఉన్న హైదరాబాద్కు మ్యాచ్లు తరలిస్తారని అంతా భావించారు. కానీ ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడిన బీసీసీఐ బాస్.. ఐపీఎల్–14 మ్యాచ్లు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశాడు. ‘ముంబై వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్లు అక్కడే జరుగుతాయి. మహారాష్ట్రలో లాక్ డౌన్ ప్రకటిస్తే మాకే మంచిది. ఎందుకంటే జనసంచారం అస్సలు ఉండదు. బయో బబుల్లో ఉండే కొంతమందికి రెగ్యులర్గా టెస్టులు చేయిస్తే సరిపోతుంది. ఒక్కసారి బబుల్లోకి ఎంటర్ అయ్యాకా ఎలాంటి భయం ఉండదు. యూఏఈలో జరిగిన గత సీజన్లో కూడా బబుల్ బయట ఇలాంటి ఘటనలే జరిగాయి. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా టోర్నీ పూర్తి చేశాం. ఇప్పుడు కూడా అంతే. లాక్డౌన్ అనేది మాకు అసలు సమస్యే కాదు. స్టేట్ గవర్నమెంట్నుంచి అన్ని రకాల పర్మిషన్స్తోపాటు హామీలు తీసుకున్నాకే ముంబైలో మ్యాచ్లు షెడ్యూల్ చేశాం. ఏప్రిల్ 10–25 తేదీల మధ్యలో ముంబై వేదికగా కేవలం 10 మ్యాచ్లే జరుగుతాయి. బయో బబుల్ ఉండటం వల్ల ఎలాంటి టెన్షన్ లేదు. సురక్షిత వాతావరణం ఏర్పాటు చేశాం. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ సేఫ్గా ఉంటారు’ అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.
పడిక్కల్కు కరోనా పాజిటివ్..
ఐపీఎల్ టీమ్లో మరో ప్లేయర్ కరోనా బారిన పడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అక్షర్ పటేల్తో పాటు తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యంగ్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్కు కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. పడిక్కల్ ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నాడు. దీంతో ఈ సీజన్లో ఆర్సీబీ ఆడే తొలి రెండు మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండడని ఆ జట్టు వర్గాలు తెలిపాయి.