- వేరే లీగ్ల్లో మెంటార్షిప్ వద్దన్న బీసీసీఐ
న్యూఢిల్లీ: ఊహించినట్లుగానే.. టీమిండియా ప్లేయర్లను ఇతర లీగ్ల్లోకి అనుమతించేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడం లేదు. యూఏఈ, సౌతాఫ్రికాలో మొదలుకాబోతున్న రెండు కొత్త టీ20 లీగ్ల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్ను కొనుగోలు చేశాయి. దీంతో టీమిండియా మాజీ సూపర్ స్టార్ ధోనీతో పాటు మరికొంత మంది ప్లేయర్లను మెంటార్స్గా బరిలోకి దించాలని ఫ్రాంచైజీలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో..ఇండియా క్రికెట్కు సంబంధించిన కాంట్రాక్ట్ లేదా రిటైర్డ్ ప్లేయర్లు ఇతర లీగ్ల్లో ఆడేందుకు, మెంటార్గా వ్యవహరించేందుకు వీలు లేకుండా బీసీసీఐ ఆదేశాలు జారీ చేయనున్నది.
ఒకవేళ ప్లేయర్లు వేరే లీగ్లో ఆడాలన్నా, ఇతర బాధ్యతలు చేపట్టాలన్నా.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో పాటు ఐపీఎల్లోనూ ఆడకుండా ఉండాలని హెచ్చరించింది. ‘డొమెస్టిక్, ఇంటర్నేషనల్ క్రికెట్కు అన్ని ఫార్మాట్స్లో గుడ్బై చెప్పాలి. బీసీసీఐతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలి. ధోనీ ఐపీఎల్ ఆడుతున్నాడు కాబట్టి అతనికి కూడా పర్మిషన్ ఇవ్వలేం. ఒకవేళ ఐపీఎల్కు వీడ్కోలు పలికితే అప్పుడు ఆలోచిస్తాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు ఫారిన్ లీగ్ల్లో పెట్టుబడులు పెడితే తమకు ఎలాంటి ఇబ్బందులు ల్లేవన్నాడు. అయితే ఐపీఎల్ బ్రాండ్కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశాడు. ఏదేమైనా ఇండియన్ ప్లేయర్లను ఫారిన్ లీగ్ల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.