కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. స్కూల్ తండాకు చెందిన దంపతులు సలావత్మత్తు, నీలాతోపాటు మరో ఇద్దరు శుక్రవారం తెల్లవారుజామను తునికాకు, పొయ్యి కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ క్రమంలోనే మత్తుపై ఒక్కసారిగా దాడి చేసింది.
అతడు భయంతో కేకలు వేయడంతో కొద్ది దూరంలో ఉన్న మిగతా వారు పరుగెత్తుకొని రావడంతో ఎలుగుబంటి పారిపోయింది. తీవ్ర గాయాలైన ఇతడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు. ఎంక్వైరీ చేస్తున్నట్లు డీఎఫ్వో నిఖిత తెలిపారు.

