బిజినెస్ డెస్క్, వెలుగు: మూడేళ్ల తర్వాత మొదటిసారిగా ఎటువంటి కరోనా రిస్ట్రిక్షన్లు లేకుండా పండగ జరుపుకుంటుండడంతో ఈసారి కన్జూమర్లు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఆన్లైన్లోను, స్టోర్లలోనూ కొనుగోళ్లు విపరీతంగా జరుగుతున్నాయి. ఇండియా వినియోగ ఆధారిత ఎకానమీ. అంటే ప్రజలు ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తే దేశ ఎకానమీకి అంత మంచిదని అర్థం. ప్రజలు చేసే షాపింగ్స్ ఎకానమీకి సపోర్ట్గా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఈసారి బండ్ల అమ్మకాలు విపరీతంగా పెరగగా, స్నాక్స్ అమ్మే కంపెనీలు కూడా సేల్స్ ఊపందుకున్నాయని పేర్కొన్నాయి. ఈ–కామర్స్ కంపెనీలయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ఈ పండగ సీజన్లో విపరీతంగా ఆర్డర్లు రావడాన్ని చూశాయి. పండగ సీజన్ స్టార్టయిన తర్వాత మొదటిసారిగా జరిగిన సేల్స్ (సెప్టెంబర్ 22– 30 మధ్య) లో ఫ్లిప్కార్ట్ అమ్మకాలు ఏకంగా 27 % (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ.46,740 కోట్లుగా నమోదయ్యాయని రెడ్సీర్ అంచనావేసింది. అదే స్టోర్లలో (ఆఫ్లైన్లో) కనీసం రూ.2.5 లక్షల కోట్ల సేల్స్ అయినా జరిగి ఉంటాయని ట్రేడర్లు అంచనావేస్తున్నారు. ఈ ఏడాది దీపావళి ఈ నెల 24 న పడింది. కరోనా వైరస్ రిస్ట్రిక్షన్లు లేకుండా జరుగుతున్న మొదటి దీపావళి ఇదేనని చెప్పొచ్చు.
బండ్లకు పెరిగిన డిమాండ్..
ఈ ఏడాది నవరాత్రి టైమ్లో బండ్ల అమ్మకాలు 57% (కిందటేడాది నవరాత్రితో పోలిస్తే) పెరిగాయని ఫాడా ప్రకటించింది. ఈ టైమ్లో టూవీలర్ అమ్మకాలు 2019 లో జరిగిన సేల్స్ కంటే 3.7 శాతం పెరిగాయని తెలిపింది. అంటే టూవీలర్ సేల్స్ కరోనా ముందు స్థాయిలకు చేరుకున్నాయని అంచనావేయొచ్చు. అలానే కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీల) అమ్మకాలు కిందటేడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో 92 శాతం పెరిగాయని సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) పేర్కొంది. దేశ ప్యాసెంజర్ కార్ల సెగ్మెంట్లో లీడర్గా కొనసాగుతున్న మారుతి ఈసారి భారీగా డిమాండ్ పెరగడాన్ని చూసింది. కంపెనీ కార్లకు డిమాండ్ 20 శాతం ( ఏడాది ప్రాతిపదికన) పెరిగిందని మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వలన కొంత డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు.
అగ్రికల్చర్, సర్వీస్ సెక్టార్లలో ఊపు..
ఇతర వస్తువులకు కూడా డిమాండ్ భారీగా పెరగడాన్ని గమనించొచ్చు. ఈసారి బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి దేశ కమర్షియల్ సెక్టార్కు భారీగా క్యాష్ ఫ్లో జరిగినట్టు రిజర్వ్ బ్యాంక్ డేటా ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య రూ.9.3 లక్షల కోట్లు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల నుంచి కమర్షియల్ సెక్టార్కు వెళ్లిందని ఆర్బీఐ పేర్కొంది. కిందటేడాది ఇదే టైమ్లో రూ.1.7 లక్షల కోట్లు కమర్షియల్ సెక్టార్కు వెళ్లాయి. కమర్షియల్ సెక్టార్కు వెళ్లడం అంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు భారీగా అప్పులు ఇచ్చాయని అర్థం. ‘ఆయిల్, గోల్డ్ కాని ఇతర దిగుమతులు కూడా మంచి స్థాయిలోనే ఉన్నాయి. దీని బట్టి లోకల్ మార్కెట్లో డిమాండ్ పుంజుకుందని అర్థం చేసుకోవచ్చు’ అని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈసారి వర్షాలు బాగా పడడం, కరోనా రెస్ట్రిక్షన్లు లేకపోవడంతో అగ్రికల్చర్, సర్వీస్ సెక్టార్, చిన్న, మధ్యతరహా కంపెనీల సెక్టార్లలో ఎకనామిక్ యాక్టివిటీ పుంజుకుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో దేశ అన్ఎంప్లాయ్మెంట్ రేటు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయిందని గుర్తు చేస్తున్నారు.
నిలకడగా రూరల్ ఎకానమీ
గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడంతో చాలా కన్జూమర్ కంపెనీలు తమ ప్రొడక్ట్ల తయారీని తిరిగి సాధారణ స్థాయికి తీసుకొస్తున్నాయి. తాము అమ్మే చిన్న ప్యాక్లు, ఫ్యామిలీ ప్యాక్ల ప్రొడక్షన్ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుందని శ్నాక్స్ అమ్మే హల్దీరామ్ పేర్కొంది. దీన్ని బట్టి రూరల్ ఏరియాల్లో కూడా కొనుగోళ్లు పెరుగుతున్నాయని అంచనావేయొచ్చని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏకే త్యాగి అన్నారు. గిఫ్ట్ ప్యాక్లకు విపరీతమైన డిమాండ్ ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుండడంతో ప్రజల ఆదాయాలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని, ఫలితంగా రానున్న రోజుల్లో కుటుంబాలు చేసే ఖర్చులు మరింత పెరుగుతాయని ఆర్బీఐ సర్వే వెల్లడించింది. వీటిలో మెజార్టీ కొనుగోళ్లు అత్యవసరమైన ప్రొడక్ట్ల కోసం జరుగుతాయని పేర్కొంది. కాగా, సప్లయ్ సైడ్ సమస్యలతో అత్యవసరమైన ప్రొడక్ట్ల రేట్లు ఈ మధ్య కాలంలో పెరిగాయి. మొత్తంగా చూస్తే కన్జూమర్ల కాన్ఫిడెన్స్ మెరుగుపడిందని, అత్యవసరం కాని ప్రొడక్ట్ల కొనుగోళ్లూ పెరుగుతాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ‘గత మూడేళ్లలో మొదటిసారిగా ఈసారి ఫెస్టివ్ సీజన్లో ఫుల్ డిమాండ్ చూస్తున్నాం’ అని ఇండస్ఇండ్ బ్యాంక్ ఎకనామిస్ట్ గౌరవ్ కపూర్ అన్నారు.