పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆమెను తమ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతివ్వాలని కోరనుంది. కాగా ఈ రోజు వారిని కోల్కతాలోని బ్యాంక్షాల్ కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా ఇటీవల జరిగిన టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ విచారణలో భాగంగా ఈడీ ఇద్దరు బెంగాల్ మంత్రుల ఇంట్లో సోదాలు నిర్వహించింది. విద్యాశాఖ మంత్రి పరేష్ అధికారే, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య ఇళ్లల్లో దాడులు చేసిన ఈడీ ... పార్థాతో దగ్గరి సంబంధాలు ఉన్న అర్పిత ముఖర్జీ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. అనంతరం సుమారు రూ.20కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈడీ దాడులను బీజేపీ చేపట్టిన కుట్రపూరిత చర్యగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే బీజేపీ సర్కారు కుట్రపన్నిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించింది. దీనికి బీజేపీ గట్టిగానే స్పందించింది. టీఎంసీ లీడర్లు, వాళ్ల అనుచరులు అర్హతలేని వ్యక్తులకు జాబ్లు ఇచ్చారని, ఈ విషయాన్ని ఈడీ, సీబీఐ తేలుస్తున్నాయని బీజేపీ పేర్కొంది. ఈ స్కాంలో మరిన్ని తలకాయలు బయటపడతాయంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెప్పారు..