నిద్ర పట్టకపోతే మరో పెగ్గు తాగండి

నిద్ర పట్టకపోతే మరో పెగ్గు తాగండి
  • మంత్రిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్స్

బెంగళూరు:  కర్నాటక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్  పాటిల్  చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో తమ పార్టీకి మహిళల మద్దతు పెరుగుతున్నదని, దీంతో లక్ష్మికి నిద్రపట్టడం లేదని ఆయన అన్నారు. బాగా నిద్ర పట్టేందుకు మరో పెగ్గు తాగాలని సూచించారు. 

ఇటీవలే జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను మంత్రి లక్ష్మి ట్విట్టర్​ లో షేర్ చేస్తూ.. మహిళలకు బీజేపీ నేతలు ఇచ్చే గౌరవం ఇలాగే ఉంటుందని కౌంటర్  వేశారు. ‘బీజేపీ నేతలు మహిళలను గౌరవించే పద్ధతిదే. బీజేపీ రహస్య అజెండా అదే. రామనామం జపించడం, బేటీ బచావో, బేటీ పఢావో అంటే సరిపోదు. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి” అని మంత్రి చురకలు వేశారు. పాటిల్  తన వ్యాఖ్యలతో మహిళలు అందరినీ  అవమానించారని ఆమె మండిపడ్డారు. కాగా, తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో సంజయ్  వివరణ ఇచ్చారు. తన ఉద్దేశంలో ఎక్స్ ట్రా పెగ్  అంటే ఎనర్జీ డ్రింక్  అని చెప్పారు. అయినా తన స్పీచ్​లో ఎవరి పేరూ ప్రస్తావించలేదని సంజయ్​ పాటిల్​ చెప్పారు.