
బెంగళూరులో ఊహించని విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అకాల మరణం కలచి వేసింది. చెప్పులో దాగున్న పాము కాటు వేయడంతో ఐటీ ఎంప్లాయ్ చనిపోయిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బెంగళూరులోని బన్నేర్ ఘట్టా ఏరియాలో జరిగింది ఈ ఘటన. చనిపోయిన ఉద్యోగి మంజు ప్రకాశ్ (41) గా గుర్తించారు. టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న ప్రకాశ్ మరణం అటు కుటుంబానికీ, ఇటు సంస్థకు తీరని లోటుగా చెప్తున్నారు.
క్రాక్స్ వదిలి ఇంట్లోకి వెళ్లి బయటకు రాలేదు:
ఇటీవలి కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉన్న క్రాక్స్ చెప్పుల్లో పాము ఎప్పుడు వచ్చి పడుకుందో తెలియదు. శనివారం (ఆగస్టు 30) మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో చెరుకు రసం తీసుకుని.. తను నివాసం ఉండే రగనాథ లేయౌట్ కు వచ్చాడు. క్రాక్స్ వదిలి ఇంట్లోకి వెళ్లాడు.
కాసేపటికి వచ్చిన.. ప్రకాశ్ కుటుంబ సభ్యులు క్రాక్స్ కు దగ్గరలో పాము చనిపోయి ఉండటం చూశారు. వెంటనే రూమ్ కు వెళ్లి చూడగా.. ప్రకాశ్ నోట్లో నుంచి నురగలు కక్కుకుని బెడ్ పైన పడుకుని ఉండటం చూశారు. అలాగే కాలు నుంచి రక్తం కారుతుండటం చూసి బోరున విలపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ప్రకాశ్ కాలుకు అంతకు ముందు జరిగిన గాయం కారణంగా.. మొద్దుబారి ఉండటంతో.. పాము కాటు నొప్పి తెలియకపోయి ఉండవచ్చునని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. 2016 లో జరిగిన బస్ యాక్సిడెంట్ కారణంగా.. కాలుకు సర్జరీ నిర్వహించారు. అప్పటి నుంచి కాలుకు స్పర్ష సరిగ్గా ఉండదని.. ఈ కారణంగానే క్రాక్స్ లో పాము కాటు వేసినప్పటికీ గుర్తించలేకపోయాడని తెలిపారు.
పాములు చెప్పులు, షూ, బైక్ కవర్స్, కార్లలోకి ఈజీగా వెళ్తుంటాయి. బయట ఉన్న పరిస్థితులకు అవి వాటికి సేఫ్ ప్లేస్ లు అనుకుని అందులో పడుకుంటాయి. కాలో చెయ్యో పెట్టినప్పుడు ఆత్మరక్షణ కోసం కాటేస్తాయి. అందుకే .. జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.