మోసగాళ్లు.. ఎప్పుడు ఎవరు దొరుకుతారా.. ఎలా మోసం చేయాలా అని వేచి చూస్తుంటారు. దీనికోసం ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లో కూర్చొనే అన్నీ చక్కపెట్టేస్తున్నాం..ఏది కావాలన్నా.. ఆన్ లైన్.. ఏది తినాలన్నా... ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాంలో ఆన్ లైన్ లో ఆర్డరిస్తే ఇట్టే క్షణాల్లో వచ్చేస్తుంది. ఒక వేళ అది వద్దనుకుంటే కేన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలానే ఓ మహిళ ఫుడ్ ఆర్డర్ పెట్టి ... కొద్ది నిమిషాల తరువాత కేన్సిల్ చేసింది. ఇక అంతే ఆమె ఎకౌంట్ నుంచి కేటుగాళ్లు 25 వేల రూపాయిలు స్వాహా చేశారు.
ప్రస్తుత కాలంలో మనుషులు ఇంట్లో చేసుకొని తినే వంటల కంటే బయట ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ శాతం మంది బయట దొరికే ఫుడ్స్ ని తినడం కోసం ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇదివరకు బయట ఫుడ్స్ తినడానికి ఫ్యామిలీతో అందరూ కలిసి బయటకు వెళ్లేవారు. కానీ రాను రాను ఆన్లైన్ యాప్ ల ద్వారా ఫుడ్డు డెలివరీ చేస్తుండడంతో ఇంట్లో కూర్చునే వారికి నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేయించుకుని క్షణాల్లో తెప్పించుకొని తింటున్నారు. ఇప్పుడు అలానే బెంగళూరులో ఓ మహిళ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టి 25 వేల రూపాయిలు పోగొట్టుకుంది.
వివరాల్లోకి వెళ్తే
బెంగళూరు లో శిల్పా సర్నోబాత్ (64) అనే మహిళ ఆగస్టు 6న ఫుడ్ ఆర్డర్ చేశారు. కాని కొన్ని నిమిషాల తరువాత ఆ ఆర్డర్ ను రద్దు చేశారు. అయితే ఆమె ఆర్డర్ పెట్టిన సంస్థ కేన్సిలేషన్ ఛార్జీలు విధించింది. ఆ తరువాత ఆమె రొటీన్ వర్క్ లో కి వెళ్లిపోయింది. అయితే రెండు రోజుల తరువాత ఆమె ఇంటి పనుల్లో బిజీగాఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను ఫుడ్ డెలివరీ సంస్థ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని.. మీరు ఆర్డర్ చేసి రద్దు చేసిన ఫుడ్ డెలివరీకి సంబంధించి కేన్సిలేషన్ చార్జీలు తిరిగి ఇస్తామని .. ఆమె ఆర్డరిచ్చిన ఫుడ్ వివరాలు షేర్ చేసుకున్నాడు.
శిల్పాను ఆ గుర్తు తెలియని వ్యక్తి మాటలతో నమ్మించి రిమోట్ డెస్క్ అప్లికేషన్ డౌన్ చేయించాడు. తరువాత అతని సూచనల ప్రకారం బ్యాంక్ ఖాతా యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చింది. మరో గంటలో మీ ఖాతాలో సంస్థ వసూలు చేసిన కేన్సిలేషన్ చార్జీలు మీ ఖాతాలో జమ అవుతాయని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక అంతే ఆమె ఖాతా నుంచి రూ. 25 వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఖంగుతిన్న ఆ మహిళ ఆ నెంబరుకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన శిల్పా పోలీసులకు ఫిర్యాదు చేసింది.