
- హెచ్చరించిన ఆర్బీఐ
ముంబై : నో యువర్ కస్టమర్(కేవైసీ) మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ మరోసారి హెచ్చరించింది. స్కామర్లు ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈ–మెయిల్తో బాధితుల వ్యక్తిగత సమాచారం, ఖాతా వివరాల వంటివి చోరీ చేస్తున్నారు. మోసగాళ్లు ఇలాంటి కమ్యూనికేషన్లు పంపి కస్టమర్లు ఆందోళనపడేలా చేస్తారు. వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోకుంటే ఖాతా రద్దవుతుందని భయపెడతారు. దీంతో బాధితుడు భయపడి మొత్తం సమాచారం ఇస్తాడు. ఫైనాన్షియల్, సైబర్ మోసాలు జరిగితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ తెలిపింది.
కేవైసీ అప్డేషన్ కోసం ఏదైనా రిక్వెస్ట్వస్తే నిర్ధారణ కోసం నేరుగా బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలని పేర్కొంది. ఆర్థిక సంస్థ కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ను దాని అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తీసుకోవాలి. ఖాతా లాగిన్ వివరాలు, పిన్లు, పాస్వర్డ్లు, ఓటీపీల వంటివి ఎవరికీ చెప్పకూడదు. వెరిఫై కాని యాప్లను ఇన్స్టాల్ చేయడం వల్ల కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.