ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ సర్కారు ఇచ్చిన జీవో నెం.45ను రద్దు చేయాలని కోరుతూ ఆల్​పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బంద్​ ప్రశాంతంగా జరిగింది. ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో పాటు కాంగ్రెస్​ లీడర్లు బుడగం శ్రీనివాసరావు, బోగాల శ్రీనివాసరెడ్డి, బొలిశెట్టి రంగారావు, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రావులపల్లి రాంప్రసాద్, కల్లూరి వెంకటేశ్వర్లు, ఆకోజు సునీల్, సీపీఎం నియోజకవర్గ కన్వీనర్​ మచ్చా వెంకటేశ్వర్లు, బాలనర్సారెడ్డి, వెంకటరెడ్డి, బండారు శరత్​బాబు, బీజేపీ లీడర్లు ములిశెట్టి రామ్మోహన్​రావు, నాగబాబు, కేశవ్​, ముత్యాల శ్రీనివాసరావు తదితరులు విజయవాడ–-జగదల్​పూర్​ హైవేపై బైఠాయించారు. ర్యాలీలతో హోరెత్తించారు. సీపీఎం లీడర్లు అమరవీరుల స్తూపం వద్ద ఆందోళన నిర్వహించారు. స్కూళ్లు, పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు, బ్యాంకులు, బట్టల దుకాణాలు మూతపడ్డాయి. మేజర్​ పంచాయతీగా కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్​ చేశారు. సీఐ నాగరాజురెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జాతీయరహదారిపై ధర్నాలు చేయవద్దని ఆందోళనకారులను హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులు, హైవేపై వాహనాల రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. సాయంత్రం వరకు బంద్​ కొనసాగింది.

అలైన్​మెంట్ మార్చాలని మంత్రికి వినతి

ఖమ్మం టౌన్, వెలుగు: నాగపూర్–అమరావతి గ్రీన్ ఫీల్డ్  హైవే అలైన్​మెంట్ మార్చాలని భూ నిర్వాసిత రైతు జేఏసీ, ఆల్​పార్టీ, రైతు సంఘాల నాయకులు కోరారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఆయన క్యాంప్​ ఆఫీసులో కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల డిమాండ్ న్యాయమైందని,  ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అలైన్​మెంట్ మార్పు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జేఏసీ కన్వీనర్ తక్కలపాటి భద్రయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా నాయకులు కొండపర్తి గోవిందరావు, సీపీఐ ఎంఎల్(ప్రజాపంథా) నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్, దొండపాటి రమేశ్, ఎస్.నవీన్ రెడ్డి, వేములపల్లి సుధీర్, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, మందనపు రవీందర్, వజ్జా రాధాకృష్ణ, సతీశ్, నాగండ్ల శ్రీధర్, బొజ్జల వెంకటయ్య, పాపినేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

న్యాయవాదుల ఫోరం వినతి..

రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి జూనియర్ న్యాయవాదుల ఫోరం జిల్లా కో ఆర్డినేటర్ పంబా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పలు రాష్ట్రాల్లో జూనియర్  లాయర్లకు స్టైఫండ్ ఇస్తున్నారని, రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని కోరారు. కోటేశ్వరరావు, కోటయ్య, కార్పొరేటర్ కన్నం వైష్ణవి పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖమ్మం కార్పొరేషన్: నగరంలో రూ.90లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. 57వ డివిజన్​ రమణగుట్టలో రూ.45 లక్షలు, 53వ డివిజన్​లో రూ.45 లక్షల పనులను ప్రారంభించారు. నగరాన్ని అన్నిరంగాల్లో డెవలప్​ చేస్తున్నట్లు తెలిపారు. మేయర్​ నీరజ, సుడా చైర్మన్​ విజయ్​కుమార్, పగడాల నాగరాజు, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, రాపర్తి శరత్, దండా జ్యోతిరెడ్డి, తమ్మిశెట్టి పరశురాం​ పాల్గొన్నారు.

ప్రెస్‌‌క్లబ్  కార్యవర్గం ఎన్నిక

ఖమ్మం టౌన్, వెలుగు: సిటీ ప్రెస్‌‌క్లబ్  కొత్త కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీయూడబ్ల్యూజే(ఐజేయు) అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు తెలిపారు. అధ్యక్షుడిగా మైసా పాపారావు, ప్రధాన కార్యదర్శిగా కూరాకుల గోపి, కోశాధికారిగా నామా పురుషోత్తం ఎన్నికైనట్లు చెప్పారు.

లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలి

​రాష్ట్రపతి పర్యటనపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

భద్రాచలం, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న భద్రాచలం పర్యటన ఖరారు కావడంతో ఏర్పాట్లపై కలెక్టర్​ అనుదీప్, ఎస్పీ వినీత్​ సమీక్షించారు. సోమవారం రాత్రి వారు రామాలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై దేవస్థానం ఆఫీసర్లకు సూచనలు చేశారు. ఐటీసీ, టొబాకో బోర్డుల్లో సిద్ధం చేసిన రెండు హెలిప్యాడ్​లను పరిశీలించారు. దేవస్థానం పరిసరాల్లో చక్కని వాతావరణం కల్పించాలని ఈవో శివాజీని ఆదేశించారు. సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు ఉండాలన్నారు. ఏఎస్పీ రోహిత్​ రాజ్, అడిషనల్ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రత్నవల్లి, ఓఎస్డీ సాయిమనోహర్, డీడీ ఏవీయేషన్​ వినయ్  పాల్గొన్నారు.

పర్యటనను సక్సెస్​ చేయాలి

భద్రాద్రికొత్తగూడెం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జిల్లా పర్యటనను సక్సెస్​ చేయాలని కలెక్టర్​ అనుదీప్​ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యటనను సక్సెస్​ చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. రాష్ట్రపతి జిల్లాకు రావడం జిల్లాకే గర్వకారణమన్నారు. పర్యటనలో భాగంగా అధికారులకు కేటాయించిన పనుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అకింతభావంతో పని చేయాలని సూచించారు.

సాగర్​ నీటి కోసం రైతుల ధర్నా

పెనుబల్లి, వెలుగు: మండలంలోని రాతోని చెరువును సాగర్​ నీటితో నింపాలని డిమాండ్​ చేస్తూ సోమవారం రైతులు ఇరిగేషన్​ ఆఫీస్​ ఎదుట ధర్నా చేశారు. నాగార్జున్​సాగర్​ ఎడమ కాల్వ నుంచి నీళ్లు వెళ్తున్నా రాతోని చెరువుకు నీరు వదలడం లేదని వియం బంజర్​లో ఇరిగేషన్​ ఈఈ శ్రీనివాసరావు, డీఈ రామారావులను ఆయకట్టు రైతులు ఘెరావ్​ చేశారు. రాతోని చెరువును సాగర్​ నీటితో నింపి, ఆ నీటిని నాలుగు చెరువులకు లిఫ్ట్​ చేయడం ద్వారా 2500 ఎకరాలకు సాగు నీరు అందుతుందని రైతులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో రబీ సాగుకు నీరు అందడం లేదని వాపోయారు. ఆయకట్టు రైతులు బొర్రా వెంకటేశ్వరరావు, మల్లెల సతీశ్, వేముల సురేశ్, చీపు వెంకటేశ్వర్లు, చలమాల విఠల్​రావు, మల్లెల శ్రీను, బండి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.