భద్రాచలం ఆలయ వస్త్ర కాంట్రాక్టర్కు రూ.లక్ష ఫైన్

భద్రాచలం ఆలయ వస్త్ర కాంట్రాక్టర్కు రూ.లక్ష ఫైన్

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తుల నుంచి వచ్చే వస్త్రాలను సేకరించే కాంట్రాక్టర్​కు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 1న గుంటూరుకు చెందిన భక్తులు గాలిగోపురానికి ఎదురుగా ఉన్న వస్త్రాల కౌంటర్​లో రెండు చీరలు, లంగా పీస్​ ఒకటి రూ.1100 ఇచ్చి కొనుగోలు చేశారు. భక్తుడికి రసీదు ఇవ్వలేదు. అలాగే అన్యమత ప్రచారంతో కూడిన కవర్​లో వస్త్రాలను పెట్టి భక్తుడికి అందజేశారు. 

దీనిపై ఆయన ఆ రోజే ఈవో రమాదేవికి ఫిర్యాదు చేశారు. దీవతో ఏఈవో శ్రావణ్​కుమార్​ను విచారణాధికారిగా నియమించారు. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం నోటీసులు ఇవ్వగా కాంట్రాక్టరు సుబ్బారావు ఇచ్చిన వివరణపై ఈవో సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో లైసెన్స్ దారుడు కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉన్నందున, ప్రథమ తప్పుగా భావించి లైసెన్స్ రద్దు చేయకుండా రూ.లక్ష జరిమానా విధించారు. మూడు రోజుల్లో ఆ జరిమానా చెల్లించాలని ఆదేశించారు.