- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
- సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్
- పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
ఎస్పీ రోహిత్ రాజుభద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా అధికారులు అలర్ట్గా ఉండాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. ఎస్పీ బి. రోహిత్ రాజు, అబ్జర్వర్లు సర్వేశ్వర్రెడ్డి, లావణ్యతో కలిసి రెండో విడత ఎన్నికలపై ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో కలెక్టరేట్ నుంచి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో రద్దీ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ కేంద్రంలో ఓటర్ రిజిస్టర్ను కచ్చితంగా నిర్వహించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ తప్పని సరిగా ఉండాలన్నారు. వీడియో కెమెరాలు బ్యాలెట్ బాక్సులను నిరంతరం పర్యవేక్షించేలా అమర్చాలని చెప్పారు.
కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. రెండు వేలకు పైగా ఓటర్లున్న జగన్నాథపురం, నరసాపురం, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. కౌంటింగ్ హాళ్లలో అవసరమైన టేబుల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఫలితాల అనంతరం ఎటువంటి ర్యాలీలు, విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి లేదని చెప్పారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ రెండో విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా రాజకీయ పార్టీలు
సహకరించాలన్నారు.

