
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ బుధవారం జన సంద్రంగా మారింది. ఆధార్ కార్డులో సవరణలు చేసుకునేందుకు వీలుగా బుధ, గురువారాల్లో కలెక్టరేట్లో స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేయడంతో మొదటి బుధవారం కలెక్టరేట్కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలను అదుపు చేసే క్రమంలో కలెక్టరేట్ గేట్లను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 28 కౌంటర్లు పెట్టారు.
ప్రతీ కౌంటర్ వద్ద వందలాదిగా ప్రజలు క్యూలో నిలబడ్డారు. చిన్న పిల్లలతో వచ్చిన తల్లులతో పాటు వృద్దులు, దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని కలెక్టర్ సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా క్యాంపులు పెడుతామని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈసురోమంటూ తిరిగి వెళ్లిపోయారు.