
న్యూఢిల్లీ: ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను రీఫైనాన్స్ చేయడానికి, బ్యాలెన్స్ షీట్ను పటిష్టం చేయడానికి, 5జీ మూలధన వ్యయ అవసరాలలో కొంత భాగాన్ని తీర్చడానికి బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8,200 కోట్లు) వరకు సమీకరించడానికి ఆఫ్షోర్ బాండ్ ఇష్యూ జారీ చేయాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోంది. భారతదేశపు రెండవ అతిపెద్ద టెల్కో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో విదేశీ మార్కెట్లలో యూఎస్ డాలర్ బాండ్ల ఫ్లోటింగ్ కోసం బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సిటీతో సహా పలు విదేశీ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది.
అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు రావడానికి కొంత సమయం పడుతుందని సంబంధిత సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు. నిధుల సమీకరణకు సంబంధించిన విధానాలు ఇంకా ఖరారు కానప్పటికీ, ఆఫ్షోర్ బాండ్లకు మూడు-–ఐదేళ్ల మెచ్యూరిటీలు ఉండే అవకాశం ఉంది. సునీల్ మిట్టల్ నాయకత్వంలోని ఈ టెల్కో కన్సాలిడేటెడ్ నికర అప్పు మార్చితో ముగిసిన క్వార్టర్లో వరుసగా 1.6శాతం పెరిగి రూ. 2.13 లక్షల కోట్లకు చేరుకుంది. లీజు బాధ్యతలు పెరగడం దీనికి కారణం. తమ కంపెనీ అప్పును మరింత తగ్గించుకుంటామని మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ ఇటీవల చెప్పారు.
ఎయిర్టెల్ గత అక్టోబర్ నుంచి తన 5జీ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. దాదాపు 3,500 కంటే ఎక్కువ నగరాలు/పట్టణాలలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అన్ని పట్టణ ప్రాంతాలలో 5జీని ప్రారంభించేలా, డిసెంబర్ నాటికి దేశం మొత్తం మీద తీసుకొచ్చేలా లక్ష్యం పెట్టుకుంది. బీఎస్ఈలో శుక్రవారం ఎయిర్టెల్ షేర్లు 0.9శాతం లాభంతో రూ.837.40 వద్ద ముగిశాయి.