బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి : గూడూరు నారాయణరెడ్డి

 బీజేపీ గెలిస్తే  బీసీ ముఖ్యమంత్రి : గూడూరు నారాయణరెడ్డి

యాదాద్రి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని భువనగిరి బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి జోష్యం చెప్పారు. ఎన్నికల ప్రచారానికి బీజేపీ లీడర్లు ఈటల రాజేందర్​ వలిగొండకు శనివారం రానున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజుతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు.

బీజేపీతోనే భువనగిరి అభివృద్ధి చెందుతుందని , పువ్వు గుర్తుకు ఓటేసీ గెలిపించాలని కోరారు. వలిగొండ మండలాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తెచ్చి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అన్ని గ్రామాలకు రోడ్లు వేయించి బస్సు సౌకర్యం, మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్నారు. భువనగిరి లో ఇప్పటివరకు డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చెయ్యలేని అసమర్థ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి అని, గెలిచిన నెలల్లోనే డిగ్రీ కళాశాల ను ఏర్పాటు చేయిస్తానని, భువనగిరి అసెంబ్లీ పరిధిలోనీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఐటీ హబ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు.

ఉపాధి కల్పించేందుకు  చర్యలు తీసుకుంటానని తద్వారా ఇంకా 60 వేల ఉద్యోగాల రూపకల్పనకు సాధ్యం అవుతుందని తెలిపారు. రజక, నాయి బ్రాహ్మణ కులాలకు కిట్లను అందించిన విషయాన్ని గుర్తు చేశారు.  పోటీ పరీక్షల కోసం కోచింగ్​ సెంటర్లు ఏర్పాటు చేయించి ట్రైనింగ్​ ఇస్తానని చెప్పారు. గతంలో ఇచ్చిన ట్రైనింగ్​ కారణంగా 79 మంది కానిస్టేబుల్​ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ప్రచారంలో పిట్టల అశోక్, భాను ప్రకాష్, నవీన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.