లోక్సభలో వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ
న్యూఢిల్లీ, వెలుగు: బీబీ నగర్ ఎయిమ్స్ను 2023 నవంబర్ లోపు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేతతో పాటు మరికొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. 2019–20 అకడమిక్ ఇయర్ నుంచి ఎంబీబీఎస్ మొదటి బ్యాచ్ మొదలైందని గుర్తు చేశారు. నిరుడు జూన్ నుంచి ఔట్పేషెంట్ సేవలు మొదలయ్యాయని చెప్పారు. ప్రధాని స్వస్త్య సురక్ష యోజన(పీఎంఎస్ఎస్వై) ఫేజ్ 5, 6, 7 కింద తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలకు 11 ఎయిమ్స్లను మంజూరు చేశామన్నారు. రూ.1,028 కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ముఖ్యమైన నిర్మాణ పనుల కోసం ఇప్పటికే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీని నియమించినట్టు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు. పనుల ఆధారంగా నాలుగేండ్లలో రూ. 28.15 కోట్లు రిలీజ్ చేశామన్నారు. దేశంలో మొత్తంగా 5 ఎరువుల ఫ్యాక్టరీలు మూతపడ్డాయన్నారు. అయితే, మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిచామని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. వాటిలో ఎరువుల ప్రొడక్షన్ మొదలైందన్నారు. కాగా, పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ పథకం పోర్టల్లో ఈ నెల 8 నాటికి దేశంలో 5,714 దరఖాస్తులు అప్లోడ్ అయ్యాయని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ చెప్పారు.