బీహార్ ​మంత్రిపై కిడ్నాప్​ కేసు.. వారెంట్ జారీ

 బీహార్ ​మంత్రిపై కిడ్నాప్​ కేసు.. వారెంట్ జారీ
  • ఇప్పటికే వారెంట్​ కూడా జారీ చేసిన కోర్టు

పాట్నా: కిడ్నాప్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటీషియన్​ను సరెండర్​ కావాలంటూ కోర్టు ఆదేశించింది.. డెడ్​లైన్​ కూడా పెట్టింది. ఆగస్టు 16న దానాపూర్​ కోర్టులో లొంగిపోవాల్సిన ఆ పొలిటీషియన్​ నేరుగా రాజ్​భవన్​కు వెళ్లి మంత్రిగా ప్రమాణం చేశాడు. ఆయనే ఆర్జేడీ ఎమ్మెల్సీ, బీహార్​ న్యాయ శాఖ మంత్రి కార్తికేయ సింగ్. మంత్రివర్గంలో కార్తికేయకు చోటుకల్పించడంపై ప్రతిపక్షాలు మండిపడుతుండగా.. సీఎం నితీశ్​ మాత్రం కార్తికేయపై వారెంట్​ జారీ అయిందనే విషయం తనకు తెలియదని సింపుల్​గా తేల్చేశారు. తనపై ఎలాంటి కేసు లేదని, అఫిడవిట్​లో అన్ని వివరాలు పొందుపరచానని కార్తికేయ సింగ్ ​వివరణ ఇచ్చాడు. అరెస్ట్​ వారెంట్​ జారీ అయిన వ్యక్తికి మంత్రి పదవి ఎట్లిస్తరని బీజేపీ ఎంపీ సుశీల్​ కుమార్​ మోడీ నితీశ్ కుమార్​​​పై మండిపడ్డారు. వెంటనే కార్తికేయను మంత్రివర్గంలో నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు.

ఎవరీ కార్తికేయ..

కార్తికేయ సింగ్​పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. ఆర్జేడీ నుంచి కార్తికేయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే, ఆర్జేడీ నేత అనంత్​ కుమార్​కు ముఖ్య అనుచరుడు. ఆర్జేడీతో కలిసి నితీశ్​ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కార్తికేయకు బీహార్​ మంత్రివర్గంలో చోటుదక్కింది. నితీశ్​ఆయనకు న్యాయ శాఖ బాధ్యతలను అప్పగించారు.