లవ్ ఎఫైర్: యువకుడి మర్మాంగాన్ని కత్తిరించి హత్య

లవ్ ఎఫైర్: యువకుడి మర్మాంగాన్ని కత్తిరించి హత్య

బీహార్‌లో దారుణ హత్య జరిగింది. ప్రేమికురాలిని కలవడానికి ఆమె ఇంటికి వెళ్లిన ప్రేమికుడిపై దాడి చేసి చంపేశారు. కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు మృతదేహాన్ని నిందితుల ఇంటి ముందే దహనం చేశారు.  

ముజఫర్‌పూర్ జిల్లాలోని కాంతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేపురా రాంపూర్షా గ్రామానికి చెందిన 17 ఏళ్ల సౌరభ్ కుమార్.. పక్క గ్రామమైన సోర్బారాలోని తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి శుక్రవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. యువకుడిని గమనించిన బాలిక బంధువులు సౌరభ్ మీద దాడిచేశారు. డైరెక్ట్‌గా ఇంటికి రావడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలిక బంధువులు.. సౌరభ్‌ మీద కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. అనంతరం సౌరభ్ మర్మాంగాన్ని కత్తిరించారు. తీవ్ర రక్తస్రావమైన సౌరభ్‌ను.. కొంతమంది స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సౌరభ్.. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి చనిపోయాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న కాంతి పోలీసులు.. ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. 

సౌరభ్ హత్యతో తీవ్ర ఆగ్రహానికిలోనైన అతని బంధువులు.. శనివారం బాలిక ఇంటిముందే సౌరభ్ అంత్యక్రియలు నిర్వహించారు. యువకుడిపై దాడిచేసింది బాలిక బంధువైన సుశాంత్ పాండేగా గుర్తించినట్లు ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు. ‘ప్రేమ వ్యవహారంతోనే బాలుడు చంపబడ్డాడని తెలుస్తోంది. సౌరభ్‌ని తీవ్రంగా కొట్టి.. అతని జననాంగాలు కత్తిరించారు. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ప్రస్తుతం సుశాంత్ పాండే అలియాస్ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశాం. నేరానికి పాల్పడిన ఇతర నిందితులను పట్టుకోవటానికి గాలింపు చేపట్టాం. కాగా.. ప్రధాన నిందితుడైన సుశాంత్ పాండే ఇంటిపై దాడి చేసిన ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశాం. వారిని అశోక్ ఠాకూర్, రంజిత్ కుమార్, ముఖేష్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాబట్టి ముందుజాగ్రత్తగా పోలీసులు ఈ రెండు గ్రామాలలో పెట్రోలింగ్ చేస్తున్నారు. మృతుని కుటుంబానికి త్వరలోనే న్యాయం జరిగేలా చూస్తాం’ అని ముజఫర్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్‌ తెలిపారు.