- బీర్భూమ్ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన ఎన్హెచ్ఆర్సీ
- గవర్నర్ను తొలగించాలని అమిత్ షాను కోరిన టీఎంసీ టీం
బీర్భూమ్: పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లా బొగ్టుయ్ గ్రామంలో సజీవ దహనం ఘటనపై సంచలన విషయాలు వెలుగుచూశాయి. మహిళలు, చిన్నారులు సహా ఎనిమిది మందిని సజీవ దహనం చేయడానికి ముందు వారిని చిత్రహింసలు పెట్టినట్టు పోస్టుమార్టం రిపోర్ట్లో వెల్లడైంది. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ నిఫుణులు పరిశీలించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సజీవ దహనానికి ముందు బాధితులపై దాడులు జరిగాయని, ఆ తర్వాతే వారిని ఇంట్లో బంధించి తగులబెట్టినట్టుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాంపూర్హట్ ఆస్పత్రి అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ సీఎం మమత ఆదేశంతో గంటల వ్యవధిలోనే స్థానిక టీఎంసీ లీడర్ అనరుల్ షేక్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటన జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఇతర ఉద్యోగులపై వేటు వేశారు. కాగా, బీర్భూమ్ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సుమోటో కేసు నమోదు చేసింది. బెంగాల్ వెళ్లి ఎన్హెచ్ఆర్సీ బృందం విచారణ జరపనుంది. ఈ ఘటనకు సంబంధించి తృణముల్ కాంగ్రెస్ నాయకుల బృందం పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిసింది. బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను తొలగించాలని ఆయనకు విజ్ఞప్తి చేసింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ నడుచుకుంటున్నారని, ఆయనను వెంటనే తొలగించాలని కోరింది. అయితే ఈ ఘటనపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని, బెంగాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఎవరీ అనరుల్ షేక్?
మమత ఆదేశాల మేరకు టీఎంసీ లీడర్ అనరుల్ షేక్ను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీర్భూమ్ ఘటన జరిగిన నాటి నుంచి టీఎంసీ బ్లాక్ ప్రెసిడెంట్గా ఉన్న అనరుల్ షేక్ పేరు మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో అతని ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. సీఎం మమత ఎదుట కూడా బాధితులు అనరుల్ షేక్ పేరును ప్రస్తావించి.. చర్యలు తీసుకోవాలని కోరారు. రాంపూర్హట్కు చెందిన అనరుల్ షేక్.. టీఎంసీ ఏర్పాటు నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. బీర్భూమ్ ఎమ్మెల్యే, బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీకి ఇతను కీలక అనుచరుడు. టీఎంసీ బ్లాక్ ప్రెసిడెంట్ కావడంతో బొగ్టుయ్ గ్రామంలో రాజకీయ పరిణామాలను ఇతడే కంట్రోల్
చేస్తుంటాడు.
బీర్భూమ్ ఘటన వెనుక పెద్ద కుట్ర: మమత
బీర్భూమ్ సజీవ దహనం ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. గురువారం బాధిత కుటుంబాలను
ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని, లొంగిపోకపోతే వారి అంతుచూస్తామని హెచ్చరించారు. ‘‘ఇలాంటి దారుణ ఘటన ఆధునిక బెంగాల్లో జరుగుతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. చిన్నారులను, మహిళలను దారుణంగా చంపేశారు. మీ కుటుంబ సభ్యులు చనిపోతే.. నా గుండె ముక్కలైపోయింది”అంటూ బాధితులను ఓదార్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. సీనియర్ పోలీస్ అధికారిని పిలిపించుకున్న మమత.. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనతో సంబంధం ఉందని ఆరోపణలు వినిపిస్తున్న టీఎంసీ లీడర్ అనరుల్ షేక్ను అరెస్ట్ చేయాలని మమత ఆదేశించారు.