సీఎం హామీలు నెరవేర్చాలి
బీజేపీ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి శ్రీనివాస్
ఆర్మూర్, వెలుగు : సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే జిల్లాలో అడుగుపెట్టాలని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఆర్మూర్లోని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్తో కలిసి ఆయన మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అనేక అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులను మంజూరు చేయకుండా తొక్కిపెడుతోందని ఆరోపించారు. బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను టీఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతోందన్నారు.
అధికారం రాగానే వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పి ఎనిమిదేళ్లు అయినా ఇప్పటికీ దాని విషయం మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఈ నెల 3న నిజామాబాద్లో జరిగే బీజేపీ బహిరంగ సభను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్, మండల ప్రెసిడెంట్స్జెస్సు అనిల్కుమార్, రోహిత్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, రవి గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, గుర్రం విజయానంద్, తూర్పు రాజు, రాజ్కుమార్, నవీన్, ఖాందేష్ ప్రశాంత్, మందుల బాలు, బాశెట్టి రాజ్కుమార్, మిర్యల్కర్ కిరణ్, రాజేందర్, బబ్లూ, శాంతన్గౌడ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
మోతెలో గణపతి వివాదం
తహసీల్దార్, ఎంపీఓలకు ఫిర్యాదు
లింగంపేట, వెలుగు మండలంలోని మోతె బస్టాండ్ ప్రాంతంలో లంబోదర లయన్స్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన గణపతి మండపం వివాదానికి దారి తీసింది. గ్రామానికి చెందిన అక్బర్కరీం తన స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై శంకర్ ఇద్దరు యువకులను స్టేషన్కు రావాలని ఫోన్ చేశాడు. ఇతరుల స్థలంలో మీరెలా గణపతి విగ్రహాన్ని పెడతారని ఎస్సై ప్రశ్నించగా.. గురువారం గ్రామానికి చెందిన 50 మంది పోలీస్స్టేషన్కు తరలివచ్చారు. 2012లో కరీంకు గ్రామంలో రెండు ప్లాట్ల స్థలాన్ని పంచాయతీ కేటాయించిందని, గణపతి విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం పంచాయతీ స్థలమని గ్రామస్తులు వివరించారు. గ్రామంలో విచారణ జరిపి న్యాయం చేయాలని స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్మారుతి, ఎంపీవో ప్రభాకర్చారికి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు వచ్చినా ఎస్సై శంకర్ మాట్లాడకుండానే వెళ్లిపోయాడని వారు ఆరోపించారు. దీనిపై ఎస్సై వివరణ కోరగా ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో బందోబస్తుకు వెళ్లినట్లు
చెప్పారు.
సీఎం సభ సక్సెస్ చేయాలి
నవీపేట్/బోధన్, వెలుగు : ఈ నెల5న నిజామాబాద్లో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం నవీపేట్, బోధన్ మండల కేంద్రాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల మీటింగ్లో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన కలెక్టర్ ఆఫీస్తో పాటు పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి సీఎం వస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, పార్టీ మండల ప్రెసిడెంట్ నర్సింగ్రావు, అల్లం రమేశ్, లోకం నర్సయ్య, వైస్ ఎంపీపీ హరీశ్, బోధన్ మీటీంగ్లో ఎంపీపీ బుద్దె సావిత్రి, జడ్పీటీసీ గిర్దావర్ లక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్లు గంగారెడ్డి, శరత్, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ నర్సయ్య పాల్గొన్నారు.
హామీ నెరవేర్చాలని..
సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ఎమ్మెల్యే షకీల్కు వీఆర్ఏలు వినతిపత్రం అందజేశారు. గురువారం నవీపేట్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేను మండలానికి చెందిన వీఆర్ఏలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 39 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
దుప్పట్లు, నోట్బుక్స్ పంపిణీ
బోధన్/నవీపేట్, వెలుగు : బోధన్ నియోజకవర్గ బీజేపీ నేత మేడపాటి ప్రకాశ్రెడ్డి జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బోధన్ పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట్ మండలాల్లోని గవర్నమెంట్ హాస్పిటళ్లలో పండ్లు పంపిణీ చేశారు. అలాగే అంగన్వాడీ, ప్రైమరీ, హైస్కూళ్లలో పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు, పండ్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బోధన్ టౌన్ ప్రెసిడెంట్ కొలిపాక బాలరాజ్, మండల ప్రెసిడెంట్ పోశెట్టి, బీజేపీ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్ పాల్గొన్నారు. నవీపేట్లో ఎంపీటీసీ రాధ, పీఏసీఎస్ డైరెక్టర్ గణేశ్, రాము, మువ్వ నాగేశ్వర్రావు, ఎస్సీ మోర్చా లీడర్ ఆనంద్, భూషణ్, రాజేందర్ గౌడ్, నాళేశ్వర్ సర్పంచ్ సరిన్, సీనియర్ కార్యకర్తలు గంగమణి, గంగాధర్, కంచరి మురళి, కోనేరు చిన్న బీమరెడ్డి, ఆకాష్, రాజు పాల్గొన్నారు
అభివృద్ధిపై చర్చకు రండి
నిజామాబాద్, వెలుగు : జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఎంపీ అర్వింద్కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని టీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సవాల్చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం ఆయన అర్బన్ ఎమ్మెల్యే గణేశ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అసరా ఇచ్చే కేసీఆర్ను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సీఎం సభకు వచ్చే వాహనాల డ్రైవర్ల సంఖ్య అంత బీజేపీ క్యాడర్ లేదని ఎద్దేవా చేశారు. ఎంపీ అర్వింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఆసరా పెన్షన్ల పంపిణీ
నందిపేట/ఆర్మూర్: మండలానికి మంజూరైన ఆసరా పెన్షన్లు గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇది వరకే 15,525 పెన్షన్లు ఉండగా కొత్తగా 2,175 మంజూరు చేసినట్లు చెప్పారు. జడ్పీ చైర్మన్ విఠల్రావు, ఎంపీపీ సంతోష్రెడ్డి, జడ్పీటీసీ ఎర్రం యమునా ముత్యం, మండల పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, ఎంపీడీవో నాగవర్ధన్, తహసీల్దార్ అనిల్కుమార్ పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలో కొత్తగా మంజూరైన 1,732 పెన్షన్లు పంపిణీ చేశారు.
వార్డు మెంబర్ను అనర్హుడిగా ప్రకటించాలి
ఆర్మూర్, వెలుగు : బాలికపై అత్యాచారానికి పాల్పడిన చేపూర్ పంచాయతీ వార్డు మెంబర్ చంద్రశేఖర్ను అనర్హుడిగా ప్రకటించాలని పంచాయతీ మెంబర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సర్పంచ్ ఇందూరు సాయన్న అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేశారు. ఆ కాపీని కలెక్టర్, డీపీవోకు నివేదించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాలికను పరామర్శించి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ పస్కా నర్సయ్య, మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మూలకిడి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
మోకాళ్లపై నిలబడి నిరసన
సిరికొండ, వెలుగు : తమ సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు చేపడుతున్న సమ్మె 39వ రోజుకు చేరుకుంది. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ ముందు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ మండల అధ్యక్షుడు రిక్క దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమర్ధవంతంగా పనిచేస్తున్న వీఆర్ఏలను చిన్నచూపు చూడడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి గంగాధర్, ప్రశాంత్, కోశాధికారి తిరుపతి పాల్గొన్నారు.
తెలంగాణకు ఏం చేస్తారో చెప్పాలి
ఇందల్వాయి/ డిచ్పల్లి, వెలుగు : బీజేపీ లీడర్లకు తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. గురువారం ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో కలిసి ఆయన ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ల ను పంపిణీ చేశారు. అనంతరం మాట్లా డుతూ బీజేపీ లీడర్లు వారు చేసేది చెప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, సుమనారెడ్డి, ఇందిర, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్లు శ్రీనివాస్రెడ్డి, గంగాదాస్ పాల్గొన్నారు.