మునుగోడులో బీజేపీ జెండా ఎగరేస్తాం : బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి

మునుగోడులో బీజేపీ జెండా ఎగరేస్తాం : బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి

మర్రిగూడ, వెలుగు:  మునుగోడు గడ్డపై కమలం జెండా ఎగరేస్తామని బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మర్రిగూడ మండలం బట్లపల్లి, కొండూరు, పడమటి తండా, వెంకపల్లితండా, చర్లగూడెం,యారగండ్లపల్లి, అజిలాపురం గ్రామాల్లో  ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఇద్దరికీ ప్రజలు అవకాశం ఇచ్చారని, తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

 కాంగ్రెస్ అభ్యర్థికి కాంట్రాక్టులు తప్ప ప్రజల సమస్యలు పట్టవని విమర్శించారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థి కూసుకుంట్ల అసమర్థ ఎమ్మెల్యేనని, మునుగోడు ప్రాంత అభివృద్ధి కోసం అసెంబ్లీలో ఏనాడు మాట్లాడే ధైర్యం చేయలేదని మండిపడ్డారు.  బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త రేషన్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, ఇంటి స్థలం తో పాటు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డి, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, కిషన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి యాస అమరేందర్ రెడ్డి, రాజు నాయక్ పాల్గొన్నారు.

ALSO READ : తెలంగాణలో దోపిడీ సర్కారును గద్దె దింపాలె : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి