కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తనున్న వేళ ప్రధాన పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుంది. ఈ క్రమంలో ఆ పార్టీలు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో స్పష్టతనివ్వలేదు. దీనికి కారణాలు లేకపోలేదు.
గ్రూపు రాజకీయాలను తగ్గించాలనే ఎత్తుగడ..
ప్రధాన పార్టీలు తమ సీఎం అభ్యర్థిపై స్పష్టంగా చెప్పకపోయినా.. జేడీఎస్ కుమారస్వామి తమ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేసింది. జేడీఎస్ సొంతంగా అధికారంలోకి రానప్పటికీ కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. బీజేపీ దేశవ్యాప్తంగా జరిగిన చాలా ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ని ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేసింది. కాగా బీజేపీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప సీఎం అభ్యర్థిగా లేకుండానే ప్రచారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రచార కమిటీ అధిపతిగా ఉన్నా అధికారికంగా ఆయనే సీఎం అభ్యర్థి అని పార్టీ ఎక్కడా ప్రకటించలేదు. కులాలే ప్రధాన పాత్ర పోషించే కర్ణాటకలో సీఎం అభ్యర్థి విషయంలో స్పష్టతనివ్వాలని ఆయా కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో క్రియా శీలకంగా ఉన్న లింగాయత్ల ఓట్లను నిలుపుకోవాలంటే సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాలని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. ఇటీవల ఈ సామాజికవర్గానికి చెందిన కొందరు సీనియర్నేతలు పార్టీని వీడిన తర్వాత ఈ డిమాండ్ బలంగా వినిపిస్తోంది. లింగాయత్లు కాకుండా ఇతర కులాల్లో బీజేపీ ఉనికిని విస్తరించాలని కోరుకునేవారు, పార్టీ సీఎం అభ్యర్థిగా లింగాయత్యేతర ముఖాన్ని కోరుకుంటున్నారు.
ఐక్యంగా పోరాడతాం అంటున్న కాంగ్రెస్
గ్రూపు రాజకీయాలు అధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది స్పష్టతనివ్వలేదు. గెలిస్తే తాము ముఖ్యమంత్రులు కావాలని ఆశిస్తున్నామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం, సీనియర్ నేత సిద్దరామయ్య స్పష్టం చేశారు. పార్టీ కోసం ఐక్యంగా పని చేయకపోతే, అది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఇద్దరూ గ్రహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కోలార్ ప్రసంగంలో, ఎన్నికల్లో గెలవడమే అందరి ప్రప్రథమ కర్తవ్యమని, మిగిలిన అన్ని సమస్యలు తరువాత పరిష్కరించుకోవాలని నేతలకు హితబోధ చేశారు.
కాగా ఎన్నికల పార్టీ అభ్యర్థుల ఎంపిక చివరి రౌండ్లో, సిద్దరామయ్య, శివకుమార్ మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. టికెట్ల పంపిణీలో ఇరువర్గాలు సద్దుమణిగినట్టు సమాచారం. అయినా గ్రాండ్ ఓల్డ్ పార్టీలో తిరుగుబాటు కార్యకలాపాల ప్రభావాన్ని తోసిపుచ్చలేం. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి కావడానికి డీకే శివకుమార్ మద్దతు ఇవ్వడంతో రాజకీయాల్లో అలజడి రేగింది.
ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న రెండు జాతీయ పార్టీల్లో చివరికి విజయం ఎవరిని వరిస్తుందో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మరి కొంత కాలం ఆగితే తెలుస్తుంది.