
- విదేశాల్లోని మేధావులు, విద్యావంతులు స్వదేశానికి రండి
- పెట్టుబడులు తీసుకొస్తే రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతాం
- మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : అమెరికాతో దౌత్య సంబంధాలు నెరపడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారం హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడారు. అమెరికా కొత్తగా తెచ్చిన నిబంధనలు.. చదువుకునేందుకు వెళ్లే స్టూడెంట్లకు, ఉపాధి కోసం వెళ్లే వారికి ఇబ్బందిగా మారుతున్నాయన్నారు.
‘విదేశాల్లో ఉన్న తెలంగాణ మేధావులు, విద్యావంతులు స్వదేశానికి రండి, మీ తెలివి తేటలను స్వదేశంలో ఉపయోగించండి. మన దేశానికి చెందిన సీఈవోలు ఇతర దేశాల్లో వందల మంది ఉన్నారు.. మీరు పెట్టుబడులు తీసుకువస్తే, ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతుంది’ అని చెప్పారు. ఇక్కడ పరిశ్రమలు పెట్టి, టెక్నాలజీని అభివృద్ధి చేస్తే గ్రామీణ ప్రాంతాలు కూడా పారిశ్రామికంగా ఎదుగుతాయన్నారు.
విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన ప్రతిఒక్కరూ వాటిని తెలంగాణకు మళ్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.