ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార బీజేపీ, విపక్ష సమాజ్ వాదీ (SP)పార్టీల మధ్య నువ్వా, నేనా అన్న రీతిలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 5 విడతల ఎన్నికలు ముగియగా.. ఇవాళ(గురువారం) ఆరో దశ పోలింగ్ జరిగింది. ఓ వైపు ఆరో విడత పోలింగ్ జరుగుతున్న సమయంలోనే సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె యూపీ ఎన్నికల ఫలితాలపై తనదైన శైలి జోస్యం చెప్పారు.
యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం ఖరారైపోయిందని, బీజేపీకి పరాభవం తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు మమతా. ఓడిపోవడంపై ఇప్పటికే బీజేపీ నేతలకు అర్థమైపోయిందని కూడా చెప్పారు. వారణాసికి వస్తున్న తనను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారని.. ఈ ఒక్క ఘటనతోనే తమకు ఓటమి ఖరారైపోయినట్లుగా బీజేపీ నేతలే చెప్పేసినట్లైందని ఆమె అన్నారు. అయినా ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వచ్చిన తనను అడ్డుకోవాల్సిన అవసరం బీజేపీకి ఏముందని కూడా దీదీ ప్రశ్నించారు. ఈ తరహా బెదిరింపులకు తాను భయపడేది లేదని, వామపక్ష పార్టీలతోనే ఏళ్ల తరబడి పోరాటం చేసిన తనను బీజేపీ శ్రేణులు భయపెట్టలేవని స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం..