నా చివరి శ్వాస వరకూ బీజేపీలోనే ఉంటా : విఠల్‌

నా చివరి శ్వాస వరకూ బీజేపీలోనే ఉంటా :  విఠల్‌

తాను టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు వస్తోన్న వార్తలపై బీజేపీ లీడర్ సీహెచ్‌ విఠల్‌ స్పందించారు. "టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు నాకు చాలా ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి, ఇది పూర్తిగా తప్పుడు వార్త. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకండి. నేను నైతిక రాజకీయ విలువలకు కట్టుబడి ఉన్నాను. నైతిక విలువలతో బీజేపీలో చేరాను. ఎవరూ నన్ను కొనుగోలు చేయరు. నా చివరి శ్వాస వరకూ బీజేపీలోనే ఉంటాను" అంటూ విఠల్‌ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 2014 నుండి 2021 వరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉన్న విఠల్‌.. 2021 డిసెంబర్లో బీజేపీలో చేరారు. 

బీజేపీలోనే ఉంటా : ఏనుగు రవీందర్ రెడ్డి

పార్టీ మార్పుపై మరో బీజేపీ లీడర్ ఏనుగు రవీందర్ రెడ్డి స్పందించారు. బీజేపీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్తున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తాను బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్, కేటీఆర్.. ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఉద్యమ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ఒక్కొక్కరిని పార్టీ నుంచి వెళ్లగొట్టారని చెప్పారు. టీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులను కావాలనే బొంద పెట్టారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నైతిక విలువలు లేవని తాము గ్రహించే పార్టీని వీడి బీజేపీలో చేరామన్నారు.