ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కుమ్మకై కేసీఆర్ పోతిరెడ్డిపాడుకు నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ. ఉమ్మడి మహబూబ్ నగర్ పై కేసీఆర్ కు ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. ఆనాడు ఏపీ ముఖ్యమంత్రి పోతిరెడ్డిపాడు కి 40 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారని గగ్గోలు పెట్టిన కేసీఆర్… ఈనాడు రోజుకు మూడు టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు కు తరలిస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వలన పాలమూరు రైతులు, ప్రజలు ఇంకెంతకాలం నష్ట పోవాలని ఆమె అన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు అరుణ. పోతిరెడ్డిపాడు కు మూడు టిఎంసిలను తరలించేందుకే పాలమూరు ప్రాజెక్టు కి 2 టీఎంసీలకు బదులు 1 టీఎంసీ కి కుదించారన్నారు. పోతిరెడ్డిపాడు కి 3 టీఎంసీల నీటిని ఎందుకు తరలిస్తున్నారో కెసిఆర్ ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఆనాడు గగ్గోలు పెట్టిన కేసీఆర్ ఈనాడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.