హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 21 మంది అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని, బీజేపీ ఓటమి కోసం మజ్లిస్, కాంగ్రెస్, బీఆర్ ఎస్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. మంగళవారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్ లో మురళీధర్ రావు మాట్లాడారు. మజ్లిస్ కు ఇచ్చిన ప్రజల ఆస్తులను బీజేపీ అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకుంటామన్నారు.
రజాకార్ల హెడ్ క్వార్టర్ గా దారుసలాం పని చేసిందని, అది రాష్ట్ర ప్రజల ఆస్తి అని అన్నారు.1969లో సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీకి ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి దారూసలాంను గిఫ్ట్ గా ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ సర్కారు రైతులను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ధాన్యానికి కనీస మద్దతు ధరతోపాటు క్వింటాకు వెయ్యి రూపాయల బోనస్ హామీని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని, రైతులకు అండగా ఉంటుందన్నారు.