ఇరు రాష్ట్రాల సీఎంలు నది జలాల వాటాలో కుమ్మక్కయ్యారని అపెక్స్ కౌన్సిల్ లో తేలిందని అన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. 575 టిఎంసీ లు రావాల్సిన కృష్ణా జలాల వాటాను 299 టిఎంసీ లకు కెసిఆర్ ఒప్పుకోవడం వలన తెలంగాణకు అన్యాయం జరిగుతుందని బీజేపీ ముందు నుండి చెప్తూ వస్తుందని, మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ లో అదే రుజువైందని ఆయన అన్నారు
“299 టిఎంసీ లకు కేసీఆర్ పెట్టిన సంతకాన్ని జగన్ ఉటంకిస్తూ తెలంగాణ వాటా 299 టిఎంసి లు మాత్రమే అని ఏపీ వాదించింది. ఇప్పుడు కేసీఆర్ మొఖం ఎక్కడ పెట్టుకుంటడు? అని” సంజయ్ విమర్శించారు. ట్రిబ్యునల్ పేరుతో నాటకం ఆడి నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులకు నీటి వాటాను అడగకుండా కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాడన్నారు. తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన కేసీఆర్ అతిపెద్ద తెలంగాణ ద్రోహి అని, ఆయన్ను చరిత్ర క్షమించదని అన్నారు. కాంట్రాక్టర్లకు నిధులు మళ్లించడానికే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కటి కావడం దురదృష్టకరమని అన్నారు.