సీబీఐని రాష్ట్రానికి రానివ్వమనే స్థాయికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. అవినీతి బయటకు రాకుండా కేసీఆర్ సర్కారు రాచరిక పాలన చేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని స్కీములు స్కామ్ లా మారుతున్నాయని మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి కూతురు అయినా చట్టానికి అతీతం కాదు. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు. చట్టం తన పని తాను చేసుకుంటూపోతుంది. చట్టం ముందు, రాజ్యాంగం ముందు అందరూ సమానమే. కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటున్నాయి.
మీరు ఏ తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రేపు మీరు న్యాయస్థానాలను కూడా తప్పుపట్టే స్థాయికి దిగజారుతారేమో అనిపిస్తోంది” అని ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం ఎలా దోచుకుంటుందో మేధావులు ఒకసారి ఆలోచించాలన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీల నుండి అసైన్డ్ భూములను లాక్కున్నరు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు అన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి. భూముల ధరలు పెంచి పేద ప్రజలకు భూమి అందుబాటులో లేకుండా చేస్తున్నారు”అని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.